హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ కొత్తగా మీథేన్ గ్యాస్ అన్వేషణను చేపట్టనున్నది. బొగ్గు పొరల్లోని 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్బెడ్ మీథేన్ బ్లాక్లకోసం నిర్వహించనున్న టెండర్లలో పాల్గొనబోతున్నది. ఇందుకోసం గుర్తించిన మూడు ప్రధాన బ్లాక్ల అన్వేషణలో పాల్గొనాలని కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వశాఖ సింగరేణిని కోరింది.
ఈ మేరకు శుక్రవారం పెట్రోలియం శాఖ ఏడీజీ సచివ్కుమార్.. సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతితో భేటి అయ్యారు. మంచిర్యాల, పెద్దపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక బ్లాక్ (5 బిలియన్ క్యూబిక్ మీటర్లు) భద్రాద్రి కొత్తగూడెంలో ఒక బ్లాక్ (2 బిలియన్ క్యూబిక్ మీటర్లు), భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల్లో మరో బ్లాక్ (12 బిలియన్ క్యూబిక్ మీటర్లు) గుర్తించామని, అన్వేషణ వేలంలో పాల్గొనాలని సింగరేణి సీఎండీని కోరారు.