ముంబై, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్ది రోజుల క్రితం టాటాలు కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియాలోకి మరో గ్రూప్ సంస్థ విస్తారా విలీనం చేయనున్నారు. ఇందుకు బదులుగా విస్తారాలో 49 శాతం వాటా కలిగిన సింగపూర్ ఎయిర్లైన్స్కు (ఎస్ఐఏ) ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను ఆఫర్ చేశారు. ఈ మేరకు సింగపూర్ ఎయిర్లైన్స్తో లావాదేవీ కుదిరినట్లు టాటా గ్రూప్ మంగళవారం ప్రకటించింది. విస్తారాలో 51 శాతం మెజారిటీ వాటా టాటాలదే. తాజా లావాదేవీతో 218 విమానాలతో ఎయిర్ ఇండియా దేశంలో అతిపెద్ద ఇంటర్నేషనల్ విమానయాన సంస్థగా ఆవిర్భవిస్తుంది. దేశీ విమానయాన కంపెనీల్లో ద్వితీయస్థానాన్ని సంపాదించుకుంటుంది.
ఎస్ఐఏ రూ.2,058 కోట్ల పెట్టుబడి
విలీన లావాదేవీలో భాగంగా ఎయిర్ ఇండియాలో రూ.2,058.5 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ఎస్ఐఏ తెలిపింది. దీంతో విస్తరించిన ఎయిర్ ఇండియా గ్రూప్లో తమకు 25.1 శాతం వాటా లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశీ విమానయాన కంపెనీల్లో రెండో స్థానంలో విస్తారా ఉండగా, తృతీయస్థానంలో ఎయిర్ ఇండియా నిలిచింది. ఈ రెండు సంస్థలకు కలిపి 18.3 శాతం మార్కెట్ వాటా ఉంది.