ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ నివేదికలో వెల్లడి
తెలంగాణకు పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగుతున్నదని ఇక్కడి ప్రభుత్వం మాత్రమే కాదు.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు సైతం స్పష్టం చేస్తున్నాయి.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల ఎగుమతుల ప్రోత్సాహక మండలి తాజా అధ్యయనమే దీనికి
నిదర్శనం. పెట్టుబడుల్లోనేగాక.. ఉద్యోగావకాశాల్లోనూ తెలంగాణ దూసుకుపోతున్నదని తేలింది.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈపీసీ) గణాంకాలే ఈ విషయాన్ని చెప్తున్నాయి. ‘ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ’ అంశంపై ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఓ అధ్యయనం చేసింది. ఈ నివేదికను ఎంఎస్ఎంఈ ఈపీసీ చైర్మన్ డీఎస్ రావత్ విడుదల చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీలతో కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు లక్ష కోట్ల రూపాయలపైనేనని తేలింది. అంతేగాక 2020-21తో చూస్తే 2021-22లో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల విలువ సుమారు 150 శాతం పెరగడం గమనార్హం. 2014-15తో పోల్చితే 2021-22లో రాష్ట ఐటీ ఎగుమతులూ రెట్టింపునకుపైగా ఎగిశాయి.
పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతం తెలంగాణేనని, సుహృద్భావపూరిత వాతావరణం రాష్ట్రంలో ఉందని పెట్టుబడిదారులు విశ్వసిస్తున్నట్టు తాజా నివేదిక చెప్పింది. మదుపరులకు ఇప్పటికీ తెలంగాణ ప్రగతిపై గట్టి నమ్మకం ఉన్నట్టు స్పష్టం చేసింది. అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తుండటం కలిసొస్తున్నదని, పారదర్శకమైన నిర్ణయాలు, సుస్థిరమైన పాలన, విధానాల అమలులో వేగం వల్లే మదుపరులు రాష్ట్రం వైపు చూస్తున్నట్టు ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ ఈపీసీ తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి, అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పిస్తున్నదని అభినందించింది.
వైద్య రంగంలోనూ తెలంగాణ మెరుగైన ప్రగతిని కనబరుస్తున్నది. 2 లక్షల మంది వైద్య చికిత్స కోసం తెలంగాణకు వచ్చినట్టుగా నివేదిక వెల్లడించింది. వీరిలో ఎక్కువగా ఆఫ్రికా, గల్ఫ్ దేశాలు, కామన్వెల్త్ ఇండిపెండెంట్ దేశాల నుంచి వస్తున్నట్టుగా గుర్తించింది. ఈ క్రమంలోనే వీరి సంఖ్య ఈ ఏడాది 25 శాతం, వచ్చే ఏడాది 35 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. హైదరాబాద్లో ఉన్న అత్యాధునిక దవాఖానలు, వైద్యులు, వైద్య సదుపాయాలే.. విదేశీయులు పెద్ద ఎత్తున రావడానికి కారణమన్నది.
ఇక ఈ నివేదికలో సూక్ష్మ, దాని అనుబంధ పరిశ్రమలు.. రాష్ట్రంలోని సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తున్నట్టు స్పష్టమైంది. 26 లక్షల ఎంఎస్ఎంఈల్లో 44 శాతం పట్టణ ప్రాంతాల్లో, 56 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడుతున్నట్టు అంచనా. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, దాని అనుబంధ పరిశ్రమలు, ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా విధానాన్ని రూపొందించిందని, ఈ విధానంతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని నివేదిక తెలియజేసింది. ఈ క్రమంలో టీఎస్ ఐపాస్పైనా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు కీర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానాన్ని చూసి వారు ఆశ్చర్యాన్నీ వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల్లోనే ఆన్లైన్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా లేదంటున్నారు మరి. ఇక పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన, అనువైన వాతావరణాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా సృష్టిస్తున్నదన్న అభిప్రాయాల్ని ఇండస్ట్రీ పెద్దలూ వెలిబుచ్చుతున్నారు. విద్యుత్తు, నీరు, భూమి, ఇతర మౌలిక సదుపాయాలతోపాటు శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైందంటున్నారు. అందుకే రాష్ట్రానికి ప్రపంచస్థాయి కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయని వివరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.2.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా రాష్టంలో 17.53 లక్షల ఉద్యోగాలు లభించాయి. ఈ ఉద్యోగాలు ప్రత్యక్షంగా వచ్చినవే. పరోక్షంగా సమకూరిన ఉపాధి, ఉద్యోగావకాశాలు మరెన్నో రెట్లుంటాయి. దీంతో తెలంగాణ అంటే పెట్టుబడులకు అనువైన రాష్ట్రమనే సంకేతం.. దేశవ్యాప్తంగా అన్నివర్గాల పారిశ్రామికవేత్తల్లో పాతుకుపోయింది. ప్రపంచంలోని టాప్-5 ఐటీ కంపెనీలు అమెరికా తరువాత తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ‘కరోనా ప్రభావిత సంవత్సరంలో ఎదురైన సవాళ్లన్నింటిని అధిగమించి తెలంగాణ రాష్ట్ర జీడీపీ 2.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో దేశ జీడీపీ 1.4 శాతం క్షీణతను చూసింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాల ప్రగతి తెలంగాణకు కలిసొచ్చింది. ముఖ్యంగా ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఈ వృద్ధి సాధ్యమైంది. ఇక ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం.. పెట్టుబడులకు అత్యంత అనువైన ప్రాంతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, క్లౌడ్ అడాప్షన్, సైబర్ సెక్యూరిటీ వంటి భవిష్యత్తు ఉన్న అంశాల్లో తెలంగాణ ఎంతో ఆకర్షణీయం’ -డీఎస్ రావత్, ఎంఎస్ఎంఈ ఈపీసీ చైర్మన్