Simple One on Aug 15 | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో ప్రత్యేకించి విద్యుత్, సోలార్ విద్యుత్ ఆధారిత స్కూటర్లు, మోటారు బైక్లు, కార్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ టూ వీలర్స్, కార్స్ కంపెనీలతోపాటు పలు స్టార్టప్ సంస్థలు విద్యుత్ ఆధారిత స్కూటర్లు, బైక్స్, కార్ల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకూ ఆఫర్లతో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం పండుగల సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో త్వరితగతిన విపణిలోకి అడుగు పెట్టేందుకు తహతహలాడుతున్నాయి.
బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్ కంపెనీలు ఓలా, ఏథేర్తోపాటు తాజాగా సింపుల్ ఎనర్జీ అనే సంస్థ పూర్తి ఎలక్ట్రిక్ స్కూటర్ను విపణిలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దానికి సింపుల్ వన్ అనే పేరు కూడా స్వాతంత్ర్య దినోత్సవం ఈ నెల 15వ తేదీన ఆవిష్కరిస్తామని సింపుల్ ఎనర్జీ ఫౌండర్ కం సీఈవో సుహాస్ రాజ్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ వసతులు కల్పిస్తామన్నారు.
ఆగస్టు 15 సాయంత్రం ఐదు గంటల నుంచి సంస్థ వెబ్సైట్లో ప్రీ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. రూ.1,947 చెల్లించి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. ఇటీవలే క్యాబ్ అగ్రిగేటర్ ఓలా అనుబంధ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలన్నా రూ.499 చెల్లించి ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల్లోపే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్కు లక్షకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
ప్రొడక్షన్ ప్రారంభం కాగానే ప్రియారిటీ ఆధారంగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ఉంటుంది. ప్రీ బుకింగ్ సొమ్ము రీఫండబుల్ అని సింపుల్ ఎనర్జీ తెలిపింది. దీంతోపాటు స్కూటర్ కోసం పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ సమాచారాన్ని వెల్లడించింది. ఆరు కిలోల కంటే ఎక్కువ బరువు గల ఈ బ్యాటరీ గ్రే కలర్లో ఉంటుంది. భారతీయుల యూసేజ్ కోసమే నిర్మించిన ఈ బ్యాటరీ ప్యాక్ను ఇంటికి తీసుకెళ్లి స్కూటర్ను చార్జి చేసుకోవడం తేలిక.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో తయారైంది. ఎకోమోడ్లో 240 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. గరిష్ఠంగా 100 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. 3.6 సెకన్లలో 50 కి.మీ స్పీడందుకుంటుంది.
ఫ్యూచరిస్టిక్ డిజైన్ గల రిమూవబుల్ బ్యాటరీతో మిడ్ డ్రైవ్ మోటార్ ఫీచర్లు ఉన్నాయి. టచ్ స్క్రీన్, ఆన్ బోర్డ్ నేవిగేషన్, బ్లూటూత్ తదితర ఫీచర్లు జత కలిశాయి. దీని ధర రూ.1.10-1.20 లక్షలు పలుకుతుంది. తొలి దశలో సింపుల్ వన్ స్కూటర్ను 13 రాష్ట్రాల్లో ఆవిష్కరిస్తారు. ప్రస్తుతం తమిళనాడులోని హొసూర్ ప్రొడక్షన్ యూనిట్లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి.
త్వరలో విపణిలో ఆవిష్కరించనున్న సింపుల్ వన్ స్కూటర్, దానిలో ఫీచర్లను, ఇతర ఆఫర్లను సింపుల్ ఎనర్జీ బహిర్గతం చేసింది. ఈ సింపుల్ వన్ స్కూటర్లో బూట్ స్పేస్ 30ఎల్టీఎస్ ఉంటుంది. సింపుల్ లూప్ అనే పేరుతో విడుదల చేస్తున్న బ్యాటరీ చార్జర్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచనున్నది. సింపుల్ టూప్ సాయంతో కేవలం 60 సెకన్లలో 2.5 కి.మీ వరకు చార్జింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.
300కి పైగా నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నది సింపుల్ ఎనర్జీ. ఈ చార్జింగ్ స్టేషన్లు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను చార్జింగ్ చేసుకోవచ్చు. కస్టమర్ల వెసులుబాటు కోసం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్లు, రెస్టారెంట్లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటుంది.