Simple energy | బెంగళూర్ కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ సంస్థ సింపుల్ ఎనర్జీ త్వరలో కార్ల తయారీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. వచ్చే 18 నెలల్లో న్యూ పవర్ ట్రైన్ను ఆవిష్కరిస్తామని సింపుల్ ఎనర్జీ ఫౌండర్ కం సీఈవో సుహాస్ రాజ్కుమార్ తెలిపారు. ఆటోమొబైల్స్ రంగంలో విభిన్న సెక్షన్లలో ప్రవేశిస్తామన్నారు. తమ సంస్థ బహుముఖ ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా అడుగులేస్తున్నదన్నారు. అందుకోసం తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీంను పెంచుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవలే దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో సింపుల్ ఎనర్జీ తన మొదటి ఈ-స్కూటర్ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సింపుల్ ఎనర్జీ సొంతంగా మోటార్, బ్యాటరీలను డెవలప్ చేసింది. మరికొన్ని టూ వీలర్స్ విపణిలో ఆవిష్కరించడంతోపాటు తదుపరి ఒక కారు.. అటుపై ఒక టూ వీలర్ వెహికల్ను ఆవిష్కరిస్తామని సుహాస్ రాజ్ కుమార్ చెప్పారు.
దీర్ఘ కాలిక ప్రణాళిక ప్రకారం వచ్చే 18 నెలల్లో దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 1000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం వచ్చే 3-7 నెలల్లో 300 పై చిలుకు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దేశీయ మార్కెట్తోపాటు విదేశాలకూ వాహనాలను ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది 30-40 వేల వెహికల్స్ విక్రయిస్తామని అంచనా వేసింది.