ShareChat : ఉద్యోగులను తొలగిస్తున్న సోషల్ మీడియా సంస్థల జాబితాలో షేర్చాట్ కూడా చేరింది. ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ జీత్11ను నిలిపివేస్తున్నట్టు ఈరోజు ప్రకటించింది. దాంతో, 5 శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది. అంటే దాదాపు 100 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ‘భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న సోషల్మీడియా సంస్థగా నిలిచేందుకు ఎప్పటికప్పుడు మా ప్రణాళికల్ని బేరీజు వేసుకుంటాం. మా లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన మార్పులు చేస్తాం. అందులో భాగంగానే జీత్ 11 యాప్ సేవల్ని నిలిపివేస్తున్నాం. కొందరిని ఇతర విభాగాల్లోకి తీసుకుంటున్నాం. మరికొందరిని ఉద్యోగం నంచి తొలగిస్తున్నాం. జీత్ 11 యాప్ నిలిపివేత ప్రభావం 5 శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులపై పడనుంది’ అని షేర్చాట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బెంగళూరుకు చెందిన అంకుశ్ సచ్దేవ, భాను ప్రతాప్ సింగ్, ఫరీద్ హసన్లు 2015లో షేర్చాట్ను ప్రారంభించారు. షేర్చాట్ మొజ్, మొజ్ లైట్ ప్లస్ వంటి అప్లికేషన్స్ తెచ్చారు. ఈ సంస్థలో ప్రస్తుతం 2,300 మంది పనిచేస్తున్నారు. ఐదు నెలల క్రితం గూగుల్, టైమ్స్ గ్రూప్, టెమసెక్ వంటి సంస్థలు షేర్చాట్లో 230 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. నేపథ్యంలో షేర్చాట్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి స్టార్టప్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఇప్పటివరకూ 16వేల మందిని ఇంటికి పంపించి వేశాయి.