హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రవాణా ఆధారిత అభివృద్ధికి చిరునామాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మారనుంది. జీఎమ్మార్ ఏరో సిటీ పేరుతో 1500 ఎకరాల్లో రకరకాల మౌలికవసతులతో సరికొత్త నగరాన్ని నిర్మిస్తున్నది. జీఎమ్మార్ సంస్థ 365 రోజులు, 24 గంటల పాటు వ్యాపార,వాణిజ్య కార్యకలాపాలు, విందు, వినోదం, విద్య, వసతి ఇలా అన్ని ఒకేచోట అందుబాటులో ఉండే ఆధునిక నగరం నిర్మాణ దశలో ఉంది.
దేశంలోని అతి పెద్ద ఏయిర్పోర్టు సిటీ(ఏరోట్రోపొలిస్)కి జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ (జీహెచ్ఐఎఎల్) అనుబంధ సంస్థగా ఉన్న జీహెచ్ఎమ్మార్ హైదరాబాద్ ఏరోట్రోపొలిస్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. విమానాశ్రయం కోసం ప్రభుత్వం కేటాయించిన 5,495 ఎకరాల్లో 1500 ఎకరాలను ఏయిర్పోర్టు సిటీకి కేటాయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్మాణాలు ప్రారంభమై, కొన్ని కంపెనీల కార్యకలాపాలు జరుగుతున్నాయి.
ఆఫీస్ స్పేస్ కోసం మొదటి దశలో 2 టవర్ల నిర్మాణం పూర్తికాగా, అందులో ఒక టవర్లో పూర్తి స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయి. రెండో దశలో మరో 2 టవర్లు కలిపి మొత్తం 4 టవర్లు బిజినెస్ కార్యకలాపాల కోసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. రిటైల్ కార్యకలాపాల కోసం ప్రీమియం షాపింగ్స్ కేంద్రాలు, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు ఉంటాయి. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉండగా, 2024కల్లా పూర్తి చేసి ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు.
ఇప్పటికే పూర్తయిన సదుపాయంలో ఆర్బీఎల్, బెస్ట్ సెల్లర్స్, ఐనాక్స్ వంటి సంస్థలు అద్దెకు తీసుకున్నాయి. తాజాగా డెకథ్లాన్ సేవలు ప్రారంభమయ్యాయని నిర్వాహకులు తెలిపారు. నోవాటెల్ 5 స్టార్ హోటల్ 288 గదులతో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. నివాసాల కోసం సుమారు 1500 బెడ్స్తో ఒక నివాస సముదాయాన్ని బోస్టన్ లివింగ్ కంపెనీ రూ.250 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నది. వీటితో పాటు జీఎమ్మార్ బిజినెస్ స్కూలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు సంబంధించిన భవన నిర్మాణం పురోగతిలో ఉంది. ఇక హెల్త్కేర్ కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. లాజిస్టిక్ సేవల కోసం 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీఎమ్మార్-ఈఎస్ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో జాయింట్ వెంచర్ చేపట్టారు. ప్రముఖ సంస్థలైన సాఫ్రాన్, సైయెంట్, స్పైస్జెట్ ఎఫ్టీజెడ్, జీఎమ్మార్ ఏరో టెక్నిక్, అమెజాన్లు కార్యకలాపాలను ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపడు తున్న ఏయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టు లో జీఎమ్మార్ సంస్థ 10 శాతం వ్యయాన్ని భరించడం ద్వారా నగరం నుంచి రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చుకోనుంది.