న్యూఢిల్లీ, జనవరి 14 : బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. ఆదివారం నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలు, ముఖ్యంగా గృహ రుణాలు, ఇతర రుణాలు తీసుకున్నవారిపై ఆర్థికభారం పడనున్నది. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 7.70 శాతం నుంచి 7.80 శాతానికి చేరుకోనున్నది. మిగతా రుణాలపై వడ్డీరేటును యథాతథంగా ఉంచడం విశేషం. దీంతో ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 7.85 శాతంగా ఉండగా, నెల, మూడు నెలల రుణాలపై రేటు 8 శాతంగాను, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.3 శాతంగా ఉన్నది. అలాగే రెండేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతంగా ఉంచిన బ్యాంక్..మూడేండ్ల రుణాలపై రేటును 8.6 శాతంగా ఉంచింది. ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకులు ఇచ్చే కనీస వడ్డీరేటును ఎంసీఎల్ఆర్గా వ్యవహరిస్తారు. ఈ ఎంసీఎల్ఆర్ని రిజర్వు బ్యాంక్ 2016లో ప్రవేశపెట్టింది.
ఈ నూతన సంవత్సరంలో రుణాలు తీసుకునేవారికి షాకిస్తున్నాయి ప్రధాన బ్యాంక్లు. ఇప్పటికే ఎస్బీఐ వడ్డీరేట్లను పెంచగా..ఈ జాబితాలోకి ఇప్పటికే హెచ్డీఎఫ్సీ, బీవోబీ, యూనియన్, ఐసీఐసీఐ, పీఎన్బీలు చేరాయి. ఈ నెల నుంచి అమలులోకి వచ్చేలా ఎంసీఎల్ఆర్ని పెంచాయి కూడా. ఇప్పటికే అత్యధిక బ్యాంక్ రుణ గ్రహీతలు తమ రుణాలను ఎంసీఎల్ఆర్తో అనుసంధానం చేసుకున్నారు.