SBI Card-UPI | దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అనుబంధ ఎస్బీఐ కార్డ్స్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేసన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డులను రూపే ప్లాట్ఫామ్ మీద యూపీఐతో అనుసంధానిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
ఇక నుంచి రూపే ప్లాట్ఫామ్ నుంచి జారీ చేసే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు యూపీఐ లావాదేవీలు జరుపొచ్చు. థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్తో రిజిస్టర్ చేసుకున్న క్రెడిట్ కార్డు నుంచి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. రూపే ప్లాట్ఫామ్పై ఎస్బీఐ క్రెడిట్ కార్డు చెల్లింపుల విస్తరణతో యూజర్లకు నిరంతర చెల్లింపుల ఫెసిలిటీ లభిస్తుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
‘ప్రతి రోజూ లక్షల లావాదేవీలు జరుపుతున్న సామూహిక డిజిటల్ ప్లాట్ఫామ్గా యూపీఐ నిలుస్తుంది. రూపే ప్లాట్ ఫామ్ మీదుగా యూపీఐతో క్రెడిట్ కార్డు చెల్లింపులకు అనుమతితో కస్టమర్లకు ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. దీంతో క్రెడిట్ కార్డుల వాడకంలో గణనీయ పురోగతి నమోదు కానున్నది’ అని ఎస్బీఐ తెలిపింది.
యూపీఐ, ఎస్బీఐ కార్డు తాజా నిర్ణయంతో ముందుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు తమ కార్డులను యూపీఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అటుపై తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించి మర్చంట్లకు చెల్లింపులు జరుపవచ్చు. రూపే ప్లాట్ఫామ్పై ఎస్బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి జరిపే యూపీఐ లావాదేవీలు ఉచితం.