Galaxy M17 5G : భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ను తీసుకొచ్చింది. తన M సిరీస్లో భాగంగా ‘గెలాక్సీ M17 5G’ మోడల్ను (ఇవాళ) శుక్రవారం అధికారికంగా లాంచ్ చేసింది. సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ఈ ఫోన్ ఉంది. శక్తివంతమైన ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా ఆరేళ్లపాటు సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇస్తామని ప్రకటించడం ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలుస్తున్నది.
యువతను, బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ఫోన్ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. బేస్ మోడల్ అయిన 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా నిర్ణయించారు. అలాగే 6GB RAM + 128GB వేరియంట్ ధరను రూ.13,999 గా, 8GB RAM + 128GB టాప్ వేరియంట్ ధరను రూ.15,499 గా ప్రకటించారు.
ఈ స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఈ నెల 13 నుంచి శాంసంగ్ ఇండియా వెబ్సైట్, అమెజాన్తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో ప్రారంభమవుతాయి. మూన్లైట్ సిల్వర్, సఫైర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ M17 5G ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను అమర్చారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉండటంవల్ల మన్నికగా ఉంటుంది.
శాంసంగ్ సొంత ప్రాసెసర్ అయిన ఎగ్జినోస్ 1330 చిప్సెట్తో ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఇచ్చారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 MP అల్ట్రావైడ్ లెన్స్, 2 MP కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్ను పెంచుకునే సౌకర్యం కూడా ఈ ఫోన్లో ఉంది. ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కెన్నెత్ పై మాట్లాడుతూ.. ‘భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గెలాక్సీ M17 5Gని రూపొందించాం. దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో ఈ ఫోన్పై పెట్టే పెట్టుబడికి పూర్తి విలువ లభిస్తుంది’ అని చెప్పారు.