న్యూఢిల్లీ, మార్చి 16: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్..వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు, ఆసియా కరెన్సీలు లాభపడటంతో రూపాయి విలువ సైతం భారీగా పెరిగింది. బుధవారం నాడిక్కడ ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో అమెరికా డాలరు మారకంలో రూపాయి విలువ ఒక్కసారిగా 42 పైసలు పెరిగి 76.20 వద్ద ముగిసింది. ఈ స్థాయిలో స్థానిక కరెన్సీ ముగియడం రెండు వారాల్లో ఇదే ప్రధమం. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రూపాయి విలువ 77 స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే. క్రమేపీ క్రూడ్ ధర తగ్గుతుండటం, స్టాక్ మార్కెట్లు పెరుగుతుండటంతో రూపాయికి కలిసివచ్చిందని అనలిస్టులు చెప్పారు.