ముంబై, జనవరి 23: గతవారం కాస్త బలపడిన రూపాయి మారకపు విలువ ఈ వారం ప్రారంభ ట్రేడింగ్ రోజైన మంగళవారం మళ్లీ దిగువబాట పట్టింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో 83.06-83.17 మధ్య హెచ్చుతగ్గులకు లోనైన రూపాయి చివరకు క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 8 పైసలు నష్టపోయి 83.15 వద్ద ముగిసింది. శుక్రవారం ఇది 83.07 వద్ద ముగియగా, సోమవారం కరెన్సీ మార్కెట్కు సెలవు. దేశీయ స్టాక్ మార్కెట్లో నెగిటివ్ ట్రెండ్ నెలకొనడం, ముడి చమురు ధర పెరగడం రూపాయి తగ్గుదలకు కారణమని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
డాలర్ ఇండెక్స్ 103.22 వద్దకు చేరగా, ప్రపంచ మార్కెట్లో బ్యారల్ క్రూడాయిల్ ధర 79 డాలర్ల స్థాయిని దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ అనూహ్యంగా 1,000 పాయింట్లకుపైగా నష్టపోయింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) వరుస విక్రయాలు సైతం రూపాయిని బలహీనపర్చిందని ట్రేడర్లు చెప్పారు. మంగళవారం స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్పీఐలు రూ.3,115 కోట్లు వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.