ముంబై, ఆగస్టు 31: కొద్ది రోజులపాటు కోలుకున్న రూపాయి విలువ గురువారం హఠాత్తుగా క్షీణించింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో 82.65 వద్ద బలహీనంగా ప్రారంభమైనరూపాయి క్రమేపీ క్షీణించి ఇంట్రాడేలో 82.79 స్థాయిని తాకింది. చివరకు క్రితం రోజుతో పోలిస్తే భారత కరెన్సీ 7 పైసలు నష్టపోయి, 82.70 వద్ద ముగిసింది.
అదానీ గ్రూప్ మారిషస్ పెట్టుబడులపై తాజాగా వెల్లడైన రిపోర్ట్ మార్కెట్లో కలవరం సృష్టించిన నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో విక్రయాలు జరుపుతారన్న అంచనాలతో రూపాయి తగ్గినట్టు ఫారెక్స్ డీలర్లు చెప్పారు. బీఎస్ఈ సెన్సెక్స్ 255 పాయింట్లు క్షీణించగా, ఎక్సేంజీల గణాంకాల ప్రకారం ఎఫ్పీఐలు బుధవారం రూ.494 కోట్లు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. శుక్రవారం యూఎస్ ద్రవ్యోల్బణం, జాబ్లెస్ క్లెయింలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు.