Foreign Exchange | ముంబై, మార్చి 20: రూపాయి గింగిరాలు కొడుతున్నది. వరుసగా ఎనిమిదో రోజు దేశీయ కరెన్సీ బక్కచిక్కింది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో బుధవారం కూడా రూపాయి విలువ 16 పైసలు కోల్పోయింది. దీంతో రెండు నెలల కనిష్ఠ స్థాయి 83.19కి పడిపోయినట్లు అయింది. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతోపాటు మిగతా కరెన్సీలు బలహీనపడినప్పటికీ డాలర్కు డిమాండ్ ఊపందుకోవడం ఇందుకు కారణమని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. 83 వద్ద ప్రారంభమైన డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 83.19 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివర్లో 16 పైసలు తగ్గి అంతే స్థాయి వద్ద ముగిసింది. మంగళవారం కూడా రూపాయి విలువ 13 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే.
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడంతో కరెన్సీ మార్కెట్లో అలజడి సృష్టించింది. గత రెండు రోజులుగా పతనమైన సూచీలు బుధవారం పెరిగినప్పటికీ ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపారు. దిగుమతిదారులు ఎగబడి డాలర్లను కొనుగోలు చేయడం వల్లనే రూపాయిపై ఒత్తిడి పెరిగిందని, అలాగే చెల్లింపులకోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి రానుండటం కూడా పతనానికి ఆజ్యంపోసిందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. అలాగే వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వు సమావేశం జరగనుండటం కూడా ప్రతికూల ప్రభా వం చూపిందన్నారు. అలాగే యూరో, పౌండ్ కరెన్సీలు కూడా తగ్గుముఖం పట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎస్బీఐ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు దన్నుగా నిలిచాయి. రూపాయి భారీగా పతనమవడం, చిన్న స్థాయి షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో భారీ లాభాలకు అడ్డుకట్టవేశాయి. ఒక దశలో 400 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు 89.64 పాయింట్లు అందుకొని 72,101.69 వద్ద ముగిశాయి. మరో సూచీ నిఫ్టీ 21.65 పాయింట్లు అందుకొని 21,839.10 వద్ద స్థిరపడింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పుంజుకోవడంతో దేశీయ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి రాగలిగాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడం కూడా సూచీలకు కలిసొచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉండటం సూచీలను కొంతమేర నిలువరించాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మారుతి, నెస్లె, పవర్గ్రిడ్, ఎస్బీఐ, ఐటీసీ, రిలయన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగియగా..టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు నష్టాల్లోకి జారుకున్నాయి. రంగాలవారీగా చూస్తే ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, టెలికమ్యూనికేషన్, ఆటో, యుటిలిటీ రంగ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. కానీ, కమోడిటీస్, ఆర్థిక సేవలు, ఐటీ, మెటల్, టెక్ షేర్లు నష్టపోయాయి.