Nirmala on Crude Price | పెరుగుతున్న ముడి చమురు ధరలు తమకు అతిపెద్ద సవాల్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా పర్యటనలో ఆమె న్యూయార్క్లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముడి చమురు ధరల పెరుగుదల అతిపెద్ద సవాల్గా అవతరిస్తోందన్నారు.
కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తమ ప్రభుత్వం తీసుకొస్తున్న కొన్ని పథకాలపై ముడి చమురు ధరల ప్రతికూల ప్రభావం ఉంటుందని సంకేతాలిచ్చారు. తమ దృష్టి మొత్తం పెరుగుతున్న ముడి చమురు ధరలపైనే ఉందని.. ఎంత గరిష్ఠంగా పెరుగుతాయి.. తత్ఫరిణామాలు ఎలా ఉంటాయన్న విషయమై కేంద్రీకరించామన్నారు.
కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి చేపట్టిన ఉద్దీపనల ప్యాకేజీలు కొంత కాలం కొనసాగుతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఉద్దీపనలతో సుస్థిర అభివృద్ధి సాధించడమే లక్ష్యం అని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేశాయి. కానీ ఇంధన ధరల పెరుగుదల, బొగ్గు నిల్వల కొరత ప్రతికూల ప్రభావం చూపుతాయేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.