30 ఏళ్లకు పైగా బిజీబిజీగా ఉద్యోగ జీవితం గడిపిన ప్రశాంత్ రెడ్డికి పేరులో తప్ప నిజజీవితంలో ప్రశాంతత లేదు. ఎందుకా అని ఆరా తీస్తే.. ఆయన రిటైర్ అయి మూ డేండ్లు అవుతున్నది. ఒంట్లో ఓపిక ఉందని ఆయన అనుకుంటున్నా కానీ కంపెనీ వాళ్లు మాత్రం నీ సేవలు ఇక చాలని చెప్పేశారు. రిటైర్మెంట్ రోజున పూల బొకేలు, షాలువా, స్వీట్లు ఇచ్చి ఇంటికి పంపించివేశారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో తాను దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ సొమ్ము తప్ప పెద్దగా దాచుకున్న సొమ్మేం లేదు. అసలే తక్కువ జీతం..దీంట్లో ఈ మధ్యకాలంలో ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర ధరలతో ఆయన సంపద హారతికర్పూలంగా కరిగిపోయింది. చివరకు ఆయనకు మిగిలింది అక్షరాల రూ.25 లక్షలు. మరింకేం.. ఆ డబ్బుతో రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించవచ్చు కదా అనుకోవచ్చు..కానీ స్టోరీ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఒక్కసారి లుక్కెద్దామా దీనిపై..
ఇదేదో ప్రశాంత రెడ్డి ఒక్కడి కథే కాదు. రిటైర్ అయిన వాళ్లందరి బాధే. వాళ్ల కష్టం చూసైనా మనం ఎంతో కొంత ఇప్పటి నుంచైనా పొదుపు ప్లానింగ్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందిపడక తప్పదు. రిటైర్ అయిన నాలుగు కుటుంబాల వాళ్లతో ఎందుకో అడగండి. ఫైనాన్షియల్ ప్లానిం గ్ వాళ్లు ముందుగా ప్లాన్ చేసుకోకపోయి ఉంటే.. ఏ స్థాయిలో ఛీత్కారాలు ఎదుర్కొవాల్సి ఉంటుందో, కోరింది.. నచ్చింది ఏది తినలేక – కొనలేక ఎంత సతమతమవుతున్నారో వాళ్ల మాటల్లోనే వినండి. ఇవన్నీ భయపెట్టేందుకు చెప్పే మాటలు కానే కావు. రాబోయే ఖర్చుల యుగంలో మనం పక్కా ప్లానింగ్తో ఇప్పటి నుంచే రూపాయి రూపాయి దాయకపోతే రేపు పొద్దున పిల్లల ముందు చేయిచాచక తప్పకపోవచ్చు. దానికి కూడా సిద్ధమే అనుకునేవాళ్లు తప్ప మిగిలిన అందరూ ఇది చదవాల్సిందే.
అసలు ఖర్చులుంటాయా ?
మనలో చాలా మంది అనుకునే పొరపాటు ఏంటంటే.. రిటైర్మెంట్ తర్వాత పెద్దగా ఖర్చులు ఉండబోవని. కానీ ఇది ముమ్మాటికి తప్పు. ఆఫీసుకు వెళ్లకపోవడం ఒక్కటే మార్పు తప్పా.. మిగిలిన విషయాలన్నీ సేమ్ టు సేమ్. పైగా అనారోగ్య ఖర్చులు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని కొన్ని కుటుంబాల్లో నెలవారీగా మందులకే రూ.10 వేల పైన ఖర్చు చేస్తారని మనలో ఎంత మందికి తెలుసు. తీర్థయాత్రలకు వెళ్లాలని అనిపిస్తుంది, మనవళ్లు, మనవరాళ్లకు పండగకో, ఏదైనా శుభకార్యానికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఉంటుంది. మరి వాటన్నింటికి పైసలు ఎలానో ఆలోచించారా? యోగిలా మనం బతకాలని అనుకున్నా.. సమాజం ఒప్పుకుంటుందా? అందుకోసమే ముందుగానే మేల్కొనండి.
ఇప్పుడెంత.. అప్పటికెంత కావాలి?
ప్రస్తుతం మీ వయస్సు 40 ఏళ్లు ఉందని అనుకుందాం. మీరు 60 ఏళ్లకు రిటైర్ కావొచ్చు. నెలనెలా దాదాపు రూ.40 వేల వరకూ ఖర్చవుతోందని లెక్కేసుకుందాం. ఇప్పటికే మీ దగ్గర రూ.5 లక్షలు పెట్టుబడులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 75 ఏళ్ల జీవన ప్రమాణాలు ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుందాం. 6.5 శాతం వరకూ ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వీటన్నింటినీ లెక్కించి చూసుకుంటే.. 2042 నాటికి మీకు కావాల్సిన కార్పస్ రూ.1.8 కోట్లు. మీ దగ్గర ఇప్పటికే ఉన్న రూ.5 లక్షలు కాస్తా రూ.34 లక్షలు అవుతుందని అనుకున్నా కూడా 20 ఏళ్ల తర్వాత మనకు ఇంకా రూ.1.5 కోట్లు కావాల్సి ఉంటుంది. మనం ఈ లక్ష్యం చేరుకోవాలంటే ఇప్పటి నుంచే నెలనెలా కనీసం రూ.13,800 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అది కూడా ఏడాదికి కనీసం 5 శాతం చొప్పున పెంచుకుంటే పోతేనే మన లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇప్పుడు పిల్లల చదువులు, పెళ్లిళ్ల ప్లానింగ్ కాకుండా రిటైర్మెంట్ కోసమే మనం ప్రత్యేకంగా చేసుకోవాల్సిన ప్లానింగ్ ఇది.
పెద్దగా ఖర్చులు పెరగకుండా, అది కూడా సింపుల్ లైఫ్ స్టైల్ చాలనుకుంటేనే ఈ మొత్తం సరిపోతుందనే విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. మెరుగవుతున్న వైద్యం కారణంగా జీవిత ప్రమాణం పెరుగుతున్నది. అది ఎంతగా పెరిగితే.. మనం అంతగా డబ్బులను పోగు చేసుకోవాల్సి ఉంటుంది. ముప్ఫై ఏళ్లకు మనం ఉద్యోగంలో చేరితే.. ముప్పై ఏళ్ల పాటు సంపాదించినా.. మరో 20 ఏళ్ల పాటు కనీసం దాన్ని కూర్చుని కరిగించేంతగా ఉండేలా డబ్బులు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
– నాగేంద్ర సాయి కుందవరం