న్యూఢిల్లీ, జనవరి 9: ఫ్రెంచ్కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశీయ మార్కెట్లోకి ఐదు సరికొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
గతేడాది సంస్థ విక్రయాలు స్తబ్దుగా నమోదయ్యాయని, ఈసారి పుంజుకునే అవకాశం ఉన్నదని రెనో ఇండియా సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిల్లపల్లి తెలిపారు. 2023లో దేశీయంగా 49 వేల యూనిట్ల విక్రయాలు జరిపిన సంస్థ..28 వేల యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మాడళ్లను ఆధునీకరించి విడుదల చేయనుండటంతో ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదుకావచ్చునని చెప్పారు.
భారత్లో భారీ పెట్టుబడులు
యూరప్ బయట భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఇటీవల రెనో ప్రకటించింది. భారత్తోపాటు ఇతర దేశాల్లో మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి 3 బిలియన్ల యూరోలను పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నిధులను కొత్త వాహనాలను తీర్చిదిద్దడానికి, రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి వినియోగించనున్నది. మరోవైపు వచ్చే ఐదేండ్లలో విడుదల చేయనున్న ఐదు నూతన మాడళ్లలో నెక్ట్స్ జనరేషన్ కైగర్, ట్రైబర్ ఉన్నాయి. దేశీయ మార్కెట్లోకి ఒకేసాని మూడు మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో రూ.4.69 లక్షలు మొదలుకొని రూ.10.99 లక్షల లోపు ధర కలిగిన క్విడ్, ట్రైబర్, కైగర్లు ఉన్నాయి. పాత వాటితో పోలిస్తే కొత్త వాటిలో పది అదనపు ఫీచర్స్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రజల అభిరుచులు మారుతున్నాయని, వారికి పెద్ద కార్లు, ఈవీ లేదా హైబ్రిడ్ కార్లపై ఆసక్తి చూపుతున్నారన్నారు.
చౌకైన ఆటోమేటిక్ కారు
దేశంలో అత్యంత చౌకైన ఆటోమేటిక్ కారు అందుబాటులోకి తీసుకొచ్చింది రెనో. ఇప్పటికే క్విడ్ మాడల్ను మార్కెట్లోకి విడుదల చేసిన సంస్థ..తాజాగా ఈ మాడల్ ఆటోమేటిక్ను పరిచయం చేసింది. రూ.4.69 లక్షల నుంచి రూ.5.95 లక్షల మధ్యలో లభించనున్నది. దేశీయంగా లభిస్తున్న ఆటోమేటిక్ వెర్షన్లలో ఇదే తక్కువ ధర కలిగిన మాడల్ కావడం విశేషం. 14 అదనపు ఫీచర్స్తో రూపొందించిన ఈ మాడల్లో సీట్ బెల్ట్ రీమైండర్, ఎలక్ట్రానిక్ స్టేబులిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. మారుతికి చెందిన ఎస్-ప్రెస్సో, ఆల్టో కే10 మాడళ్లకు పోటీగా సంస్థ ఈ మాడల్ను ప్రవేశపెట్టింది.