Vehicle Insurance | మీ వాహనం ఇన్సూరెన్స్ రెన్యూవల్ గడువు దాటిపోయిందా.. గడువు ముగిసిన తర్వాత కూడా దాన్ని రెన్యూవల్ చేసుకోవచ్చా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. రోడ్లపై వాహనాలతో తిరిగే వారు తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండాల్సిందే.
వాహన బీమా పాలసీ పునరుద్ధరణ సమయంలో సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు చెప్పిన ప్రీమియం మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. మంచి పాలసీ కోరుతూనే.. దాని ప్రీమియం తగ్గించాలని మీరు కోరవచ్చు. మీరెప్పుడు ఆ వెహికల్ కొన్నారు, ప్రస్తుతం మార్కెట్లో దాని విలువ ఎంత, సదరు వెహికల్ కండిషన్ తదితర అంశాలను బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం ఖరారు చేస్తుంటారు. వాహనంలో ఎటువంటి లోపాల్లేవని భావిస్తే ప్రీమియం తగ్గించాలని కోరొచ్చు. అప్పుడు సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు వెహికల్ను పూర్తిగా పరిశీలించి నిబంధనలను బట్టి ప్రీమియం తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
కొత్త వెహికల్ అయితే సమగ్ర బీమా పాలసీ తీసుకోవడం మేలు అని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఓన్ డ్యామేజీతోపాటు థర్డ్ పార్టీ కవరేజీ కూడా వస్తుంది. మరీ పాత వెహికల్ అయితే ‘ఓన్ డ్యామేజీ’ తీసుకోకున్నా ఫర్వాలేదంటుని అంటున్నారు. అలా ప్రీమియంలో కొంత ఆదా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఓన్ డ్యామేజీ వదులుకోవడం అంటే మీరు వెహికల్ నడిపే తీరు, వెహికల్ విలవు, మీ స్థోమత ఆధారంగా నిర్ణయించుకోవాలి.
ఎవరైనా సరే గడువు లోపే బీమా పాలసీ పునరుద్ధరించుకోవడం బెటర్ అని ఇన్సూరెన్స్ రంగ నిపుణులు అంటున్నారు. దీనివల్ల ప్రీమియంలో కొంత రాయితీ పొందొచ్చు. గడువు ముగిస్తే ‘నో క్లయిమ్ బోనస్’ వంటి రాయితీలు వదులుకోవాల్సి వస్తుంది.
వాహన వాడకాన్ని బట్టి కొన్ని బీమా రంగ సంస్థలు పాలసీలు నిర్ణయిస్తున్నారు. డ్రైవింగ్ బిహేవియర్, మైలేజీ, ఇప్పటివరకూ వాహన ప్రయాణ దూరం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బీమా పాలసీని ఖరారు చేస్తుంటారు. ప్రీమియం కూడా అందుకనుగుణంగానే మారుతుంది. వాహన చోదకులు తరుచూ దాన్ని బయటకు తీయకపోతే ఇటువంటి బీమా పాలసీలు తీసుకుని ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు.
సాధారణ బీమా పాలసీకి తోడు యాడ్-ఆన్ కూడా జోడిస్తే సదరు పాలసీ మరింత సమగ్రమవుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉపయుక్తంగా ఉంటుంది. వరదల ప్రాంతాల్లో ఇంజిన్ ప్రొటెక్షన్ కవరేజీ.. రోడ్ సైడ్ అసిస్టెన్స్ కోసం యాడ్ ఆన్ తీసుకుంటే.. ప్రయాణం మధ్యలో వెహికల్ కదలకుండా మొరాయిస్తే.. సొంతంగా ఎటువంటి ఖర్చు లేకుండా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లవచ్చు.