న్యూఢిల్లీ, ఆగస్టు 23: తమ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) రూ.8,278 కోట్ల (సుమారు బిలియన్ డాలర్లు)పెట్టుబడుల్ని పెట్టబోతున్నదని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బుధవారం ప్రకటించింది. ఆర్ఆర్వీఎల్ విలువను రూ.8.278 లక్షల కోట్లు (దాదాపు 100 బిలియన్ డాలర్లు)గా లెక్కించి ఈ డీల్ జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఖతార్ పెట్టుబడులకు ఆర్ఆర్వీఎల్లో 0.99 శాతం వాటా దక్కుతున్నట్టు రిలయన్స్ స్టాక్ ఎక్సేంజీలకు వెల్లడించింది. కాగా, ఆర్ఆర్వీఎల్కు దేశవ్యాప్తంగా 18,500లకుపైగా స్టోర్లున్నాయి. ఓవైపు వివిధ బ్రాండ్లను సొంతం చేసుకుంటూ, మరోవైపు ప్రముఖ విదేశీ బ్రాండ్ల ఫ్రాంఛైజీ హక్కులను పొందుతూ భారతీయ రిటైల్ మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో ఈ కంపెనీలోకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. 2020లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ నుంచి 10.09 శాతం వాటాకుగాను రూ. 47,265 కోట్లను అందుకున్నది. అప్పట్లో భారతీయ రిటైల్ రంగంలో ఇదే భారీ లావాదేవీ. నాటి డీల్లో సంస్థ విలువను రూ.4.2 లక్షల కోట్లకుపైగా పేర్కొన్నారు. అయితే గడిచిన మూడేండ్లలో కంపెనీ విలువ రెట్టింపైనట్టు రాబోయే ఖతార్ పెట్టుబడులతో తేలింది.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లోకి ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీని ఓ మదుపరిగా ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. ఆర్ఆర్వీఎల్ను ప్రపంచ శ్రేణి సంస్థగా నిలబెట్టడానికి క్యూఐఏ అనుభవం, ట్రాక్ రికార్డ్ కలిసొస్తుంది. ఇరు సంస్థల భాగస్వామ్యం.. భారతీయ రిటైల్ రంగ స్వరూపాన్నే మార్చగలదు.
– ఇషా అంబానీ, ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్
వేగంగా విస్తరిస్తున్న భారతీయ రిటైల్ మార్కెట్లో అత్యంత వృద్ధిదాయక కంపెనీలకు మద్దతివ్వడానికి క్యూఐఏ కట్టుబడి ఉన్నది. ఆర్ఆర్వీఎల్లో భాగస్వామ్యం కోసం మేము ఎదురుచూస్తున్నాం. కంపెనీకి బలమైన విజన్, వృద్ధి అంచనాలున్నాయి.
– మన్సూర్ ఇబ్రహిం అల్ మహమూద్, క్యూఐఏ సీఈవో