Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ప్రకటనకు కట్టుబడి ఉంది. ఈ ఏడాది జరిగిన ఏజీఎం సమావేశంలో ఎఫ్ఎంసీజీ సెక్టార్లోకి ప్రవేశిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఇండిపెండెన్స్ అనే బ్రాండ్ పేరుతో రిలయన్స్-ఎఫ్ఎంసీజీ సెక్టార్ సేవలు ప్రారంభించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇండిపెండెన్స్ బ్రాండ్ ప్రారంభించారు. నిత్యావసర వస్తువులు, శుద్ధి చేసిన ఫుడ్ ప్రొడక్ట్స్ను ఇండిపెండెన్స్ పేరిట విక్రయిస్తారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్.. ఈ ఇండిపెండెన్స్ బ్రాండ్ను తీసుకువచ్చింది.
బిస్కట్లు, వంటనూనెలు, పప్పులు, తృణ ధాన్యాలు వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఇతర నిత్యావసర వస్తువులను ఇండిపెండెన్స్ బ్రాండ్ కింద విక్రయిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. తమ బ్రాండ్ కింద తీసుకొచ్చే ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేస్తామని, వినియోగదారులకు అందుబాటు ధరలోనే వీటిని తీసుకొస్తామని చెప్పారు.
రిలయన్స్ తన ఇండిపెండెన్స్ బ్రాండ్ను త్వరలో గుజరాత్ వ్యాప్తంగా, అటుపై దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో కంపెనీ యాజమాన్యం.. ఎఫ్ఎంసీజీ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తదనుగుణంగానే ఇండిపెండెన్స్ అనే బ్రాండ్ తీసుకొచ్చింది. రిలయన్స్ రిటైల్కు సొంతంగా దేశవ్యాప్తంగా 16,500 స్టోర్లు ఉన్నాయి.