మైనింగ్, తయారీ రంగాల్లో ఆవరించిన నిస్తేజమే యావత్తు దేశ పారిశ్రామిక రంగ ప్రగతికి ఆటంకంగా నిలిచింది. ఆగస్టులో తయారీ రంగం పనితీరు మైనస్ 0.8 శాతానికి దిగజారింది. అంతకుముందు నెల జూలైలో వృద్ధిరేటు 3 శాతంగా ఉన్నది. నిరుడు ఆగస్టులో 11.1 శాతంగా ఉన్నట్టు తేలింది. అలాగే గనుల రంగ కార్యకలాపాలు ఈ ఆగస్టులో మైనస్ 3.9 శాతానికి క్షీణించాయని కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ జూలైలో మైనస్ 3.3 శాతంగా ఉండగా, గత ఏడాది ఆగస్టులో 23.3 శాతం వృద్ధి నమోదైంది. ఈ విద్యుదుత్పత్తి ఆగస్టులో 1.4 శాతం, అంతకుముందు నెల 2.3 శాతం, నిరుడు ఆగస్టులో 16 శాతం చొప్పున వృద్ధి కనిపించింది.
అయినప్పటికీ కీలకమైన మైనింగ్, తయారీ రంగాలు నెమ్మదించడంతో ఫలితం లేకుండా పోయింది. ఇదిలావుంటే ఈ ఏప్రిల్-ఆగస్టు నెలల్లో ఐఐపీ 7.7 శాతం పెరిగింది. అయితే నిరుడు ఇదే సమయంలో 29 శాతం వృద్ధిరేటు ఉండటం గమనార్హం. ఇక కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్సేతర రంగాల్లో మైనస్ 2.5 శాతం, మైనస్ 9.9 శాతం తిరోగమనం కనిపించింది. వాస్తవానికి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో నిరుడు ఆగస్టులో 11.1 శాతం వృద్ధి ఉన్నది.
కష్టాల్లో పరిశ్రమలు
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది చాలా రాష్ర్టాల్లో పరిశ్రమల పరిస్థితి. ఇప్పుడిప్పుడే కరోనా ఇబ్బందుల నుంచి గట్టెక్కుతున్న కంపెనీలకు రుణాలపై అధిక వడ్డీరేట్ల దెబ్బ గట్టిగానే తగులుతున్నది మరి. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సాయం అందడం లేదన్న ఆవేదన పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడు కనిపిస్తున్నది. కావాల్సినంత పెట్టుబడులు లేక ఉత్పత్తి నిలిచిపోతున్నదని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని దేశంలోని మెజారిటీ ఎంఎస్ఎంఈలు వాపోతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలూ తమకు అందడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితులు ఇలాగే కొనసాగితే సంక్షోభం తప్పదన్న హెచ్చరికలు నిపుణుల నుంచి వస్తున్నాయి.