Rear Seat Belt Alarm | జాతీయ రహదారిపై కారులో ప్రయాణం చేస్తున్నా, పట్టణాలు, నగరాల పరిధిలో వెళుతున్నా.. ఒక్కోసారి ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఇటీవలే జాతీయ రహదారిపై వెళుతున్న కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ దుర్మరణం పాలయ్యారు. దీంతో కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే డ్రైవర్తోపాటు ముందు సీట్లో కూర్చున్న సహ ప్రయాణికుడికి సీట్ బెల్ట్, 6-ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేసింది.
ఇక ముందు వెనుక సీటులో కూర్చున్న వారూ బెల్ట్ పెట్టుకోకున్నా అలారం వినిపిస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ‘రేర్ సీట్ బెల్ట్ అలారం’ తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణాశాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే వచ్చే ఏడాది ఒకటో తేదీ నుంచి విక్రయించే అన్ని కార్లలోనూ రేర్ సీట్బెల్ట్ అలారం తప్పనిసరిగా ఇన్స్టల్ చేయాల్సి ఉంటుంది.
కారులో రేర్ సీట్ బెల్ట్ అలారం ఫీచర్ను ఆటోమొబైల్ సంస్థలు తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ జాతీయ రహదారులపై వెళుతున్నప్పుడు వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే అలారం మోగుతూనే ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతే అలారం ఆగిపోతుంది.
ప్రస్తుతం సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) ప్రకారం డ్రైవర్, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ తప్పనిసరిగా ఇన్ బిల్ట్ సీట్ బెల్ట్ రిమైండర్ ఉంటుంది. రేర్ సీట్ ప్యాసింజర్లు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్)లోని 138 (3) సెక్షన్ కింద రూ.1000 ఫైన్ విధిస్తారు. రేర్ సీట్లో కూర్చున్న టాటా మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆయన స్నేహితుడు జహంగీర్ పండోలే కారు ప్రమాదంలో మరణించడంతో రేర్ సీట్ బెల్ట్ రిమైండర్ తప్పనిసరి చేస్తూ కేంద్రం డ్రాఫ్ట్ ముసాయిదా రిలీజ్ చేసింది.