RBI penalty on SBI | కేంద్ర ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐపై ఆర్బీఐ రూ.కోటి పెనాల్టీ విధించింది. రుణాలు తీసుకున్న సంస్థల్లో 30 శాతానికి పైగా షేర్ క్యాపిటల్ను తన ఆధీనంలో కలిగి ఉన్నందుకు ఈ జరిమానా విధించామని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949లోని సబ్ సెక్షన్-2 కింద ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఈ నిబంధన ప్రకారం రుణాలు తీసుకున్న సంస్థల్లో 30 శాతానికి పైగా పెయిడ్-అప్ షేర్లను బ్యాంకు ఆధీనంలో పెట్టుకోరాదు. ఈ విషయమై 2018 మార్చి 31, 2019 మార్చి 31 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాల ఫైనాన్సియల్ పొజిషన్
ను ఆర్బీఐ తనిఖీ చేసినప్పుడు ఈ సంగతి బయటపడింది.
దీంతో బ్యాంకుపై ఎందుకు జరిమాన విధించకూడదో తెలియజేయాలంటూ ఎస్బీఐకి ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. ఎస్బీఐ సమాధానం పరిశీలించిన తర్వాతే రూ.కోటి జరిమాన విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది.