ఇతర చార్జీలపైనా సీలింగ్ పెట్టాలి
సూక్ష్మ రుణ సంస్థలకు ఆర్బీఐ మార్గదర్శకాలు
ముంబై, మార్చి 14: సూక్ష్మ రుణాల సంస్థలు రుణగ్రహీతల నుంచి అధిక వడ్డీరేట్లు వసూలు చేయరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం తమ తాజా మార్గదర్శకాల్లో ఆదేశించింది. రుణాలపై వడ్డీరేట్లతోపాటు ఇతర చార్జీలపైనా సీలింగ్ పెట్టాలన్నది. ‘సూక్ష్మ రుణాలు అనేవి రూ.3 లక్షల వరకు వార్షిక ఆదాయమున్న గృహస్తులకిచ్చే తాకట్టు లేని అప్పులు’ అంటూ ‘మాస్టర్ డైరెక్షన్-రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ మైక్రోఫైనాన్స్ లోన్స్) డైరెక్షన్స్-2022’ జారీ సందర్భంగా ఆర్బీఐ నిర్వచించింది. కాబట్టి అన్ని నియంత్రిత సంస్థలు.. మైక్రోఫైనాన్స్ లోన్ల వడ్డీరేట్లు, ఇతర చార్జీలకు సంబంధించి బోర్డు ఆమోదిత విధానాన్నే ఆచరణలో పెట్టాలని స్పష్టం చేసింది. ‘సూక్ష్మ రుణాలపై వడ్డీరేట్లు ఇతర చార్జీలు/ఫీజులు అధికంగా ఉండరాదు. ఆర్బీఐ సూచనలకు లోబడే ఉండాలి’ అని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. ఈ క్రమంలోనే ఫ్యాక్ట్షీట్లో ప్రకటించిన వడ్డీరేట్లను కాకుండా పెంచి వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
జరిమానాలు వేయరాదు
తీసుకున్న రుణాలకు సంబంధించి ముందస్తు చెల్లింపులు జరిపే రుణగ్రహీతలపై సూక్ష్మ రుణ సంస్థలు ఎటువంటి జరిమానాలూ వేయరాదని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ చెల్లింపుల్లో ఆలస్యమైతే బకాయి ఉన్న మొత్తాలపైనే జరిమానాలు వేయాలని, మొత్తం రుణాన్ని పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఇక వడ్డీరేట్ల సమాచారాన్ని రుణగ్రహీతలకు అర్థమయ్యేలా సరళతర భాషలో ప్రదర్శించాలని కూడా చెప్పింది. రుణ ఒప్పందాలూ వాడుక భాషలో ఉండాలని సూచించింది.
ఎన్బీఎఫ్సీ ఏయూఎం పైపైకి
రిటైల్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) పెరిగే అవకాశాలున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ రేటింగ్స్ తెలిపింది. హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల ఏయూఎం ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో 5-7 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో 8-10 శాతానికి చేరవచ్చని సోమవారం విడుదల చేసిన ఓ నివేదికలో అంచనా వేసింది. ఆపై ఆర్థిక సంవత్సరం (2023-24)లో 9-11 శాతానికి ఎగిసే వీలుందన్నది. కానీ హోల్సేల్ ఎన్బీఎఫ్సీల ఏయూఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణతకే పరిమితం కావచ్చని పేర్కొన్నది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం స్థిరత్వాన్ని సంతరించుకోవచ్చని అంచనా వేసింది.