Bharat Biotech | హైదరాబాద్, జూలై 27: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ భారత్ బయోటెక్..తాజాగా దుస్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. తమిళనాడుకు చెందిన అల్లిన దుస్తుల సంస్థ ఈస్ట్మెన్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ క్లాథింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో 20 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆర్థిక వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ నూతన పెట్టుబడులను వ్యాపార విస్తరణకు, మూలధన వ్యయం కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే విస్తరంఇచిన ఈస్ట్మన్..అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తున్నది.
భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా మాట్లాడుతూ..మేక్ ఇన్ ఇండియాకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, కాటన్ ఆధారిత దుస్తులకు మరింత ప్రమోటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. గ్రామీణ, చిన్న స్థాయి నగరాల్లో ఉపాధి అవకాశాలు అందించడానికి, ముఖ్యంగా 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ గ్రూపుతో జట్టుకట్టడం చాలా సంతోషంగా ఉన్నదని ఈస్ట్మెన్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ ఎన్ చంద్రన్ అన్నారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్లో కార్యాలయాలను తెరిచినట్లు, యూఏఈతో ఉన్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ దేశంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.