పట్నా : కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు అన్లాక్ ప్రక్రియకు తెరతీశాయి. బిహార్లో ఈనెల 23 నుంచి నూరం శాతం సిబ్బందితో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను తెరిచేందుకు అనుమతిస్తామని సీఎం నితీష్ కుమార్ సోమవారం వెల్లడించారు.షాపులు, వాణిజ్య సంస్ధలు రాత్రి ఏడు గంటల వరకూ తెరిచే వెసులుబాటు కల్పించామని చెప్పారు.
రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అన్నారు. ఇక పార్కులు, గార్డెన్లను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరిచిఉంచుతారని తెలిపారు. ఇక కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయని ప్రజలు అశ్రద్ధతో వ్యవహరించరాదని, కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి సహకరించాలని సీఎం నితీష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.