Byju’s Employee | ఆర్థిక ఇబ్బందులు.. దర్యాప్తు సంస్థల దాడులు.. ఉద్యోగుల సామూహిక ఉద్వాసనలతో కొన్ని నెలలుగా సతమతం అవుతున్న ఎడ్-టెక్ స్టార్టప్.. బైజూ`స్ కష్టాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. బైజూ`స్ లో పని చేస్తున్న ఓ ఉద్యోగినిని సంస్థ యాజమాన్యం తొలగించేసింది. తన ఉద్వాసన విషయంలో యాజమాన్యం అనుసరించిన తీరుపై సదరు ఉద్యోగిని కన్నీటి పర్యంతమవుతూ తన లింక్డ్ఇన్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
బైజూస్ యాజమాన్యం తక్షణం రాజీనామా చేయాలని తనను బలవంతంగా చేసిందని ఆరోపించారు. 18 నెలలుగా బైజూ`స్లో అకడమిక్ స్పెషలిస్టుగా పని చేస్తున్న ఆకాంక్ష ఖేమ్కా.. తనపైనే తన కుటుంబం ఆధారపడి జీవిస్తున్నదని వాపోయారు. తన వేతన బకాయిలు చెల్లించనే లేదన్నారు. `వారు (బైజూ`స్) నా వేతన బకాయిలు పే చేయలేదు. ఎర్న్డ్ లీవ్స్ మనీ చెల్లించలేదు. తక్షణం రాజీనామా చేయాలని నాకు లెటర్ పంపారు` అని ఆరోపించారు.
బైజూ`స్ మోసాలకు పాల్పడుతున్నదని, ఉద్యోగులనూ కస్టమర్లను మోసగిస్తున్నదని ఆకాంక్ష ఖేమ్కా ఆరోపించారు. తనకు ప్రభుత్వమే సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. `నా కుటుంబంలో నేనొక్కదాన్నే ఆదాయం సంపాదించే వ్యక్తిని. నా భర్త అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నేను రుణాలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ వారు (బైజూ`స్) నా వేతన బకాయిలు చెల్లించకుంటే నేనెలా బతకాలి..? ` అని ఆకాంక్ష కన్నీటి పర్యంతం అయ్యారు.
`విషపూరిత వర్క్ కల్చర్లో చిక్కుకున్న ఇతర ఉద్యోగులను కాపాడండి. నాకు దయచేసి ప్రభుత్వం సాయం చేయాలి. ఉద్యోగులు, కస్టమర్లతోపాటు బైజూ`స్ యాజమాన్యం అన్ని వైపులా మోసాలకు పాల్పడుతోంది` అని ఆకాంక్ష ఖేమ్కా చెప్పారు. కంపెనీ ఎదుర్కొంటున్న కష్టాలపై బైజూ`స్ ఫౌండర్ బైజూ రవీంద్రన్ కన్నీటి పర్యంతమైన వీడియోకి సంబంధించిన వార్త బయటకు వచ్చిన రెండు రోజులకు ఆ సంస్థ ఉద్యోగిని వీడియో వెలుగు చూడటం గమనార్హం.
కొన్ని నెలలుగా బైజూ`స్ ఫౌండర్ బైజూ రవీంద్రన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఆన్లైన్ ట్యూటరింగ్ స్టార్టప్గా వెలుగు వెలిగిన బైజూ`స్ సకాలంలో తన ఆర్థిక ఫలితాలను వెల్లడించలేదు. దీంతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నదన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలు బైజూ`స్పై దాడులు చేశాయి.
న్యాయ వివాదాల సాకుతో 50 కోట్ల డాలర్ల నిధులు బైజూ`స్ యాజమాన్యం దాచి పెట్టిందని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న పలువురు ఇన్వెస్టర్లు ఆరోపించారు. ప్రైవేట్ ట్యూటర్గా కెరీర్ ప్రారంభించిన బైజూ రవీంద్రన్.. బైజూ`స్ స్టార్టప్ ప్రారంభించిన తర్వాత పలువురు గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి 22 బిలియన్ డాలర్ల నిధులు సేకరించింది. సీక్వోయియా క్యాపిటల్, బ్లాక్ స్టోన్ ఇంక్, మార్క్ జుకర్బర్గ్ ఫౌండేషన్ వంటి సంస్థలు బైజూ`స్లో పెట్టుబడులు పెట్టాయి. కరోనా మహమ్మారి వేళ భారత ఎడ్టెక్ మార్కెట్లో బైజూ`స్ ఒక వెలుగు వెలిగింది.
కానీ, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి, విద్యాసంస్థలు తెరుచుకున్న తర్వాత బైజూ`స్ ఖ్యాతిని సంస్థ ఆర్థిక వనరులు ప్రశ్నార్థకం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగమేఘాలపై డజన్ల కొద్దీ కంపెనీలను టేకోవర్ చేసిన కంపెనీకి ఏండ్ల తరబడి చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ను ఎందుకు నియమించలేదని బైజూ రవీంద్రన్ను ఇన్వెస్టర్లు ప్రశ్నించారు.
సంస్థలో ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో కొందరు ఉద్యోగులు స్వచ్ఛందంగా వెళ్లిపోతే, మరికొంత మందికి ఉద్వాసన పలికింది బైజూ`స్. బోర్డు సభ్యులు రాజీనామా చేశారు. పలు టీచింగ్ కేంద్రాలు విద్యార్థుల్లేక వెలవెలబోపతున్నాయి. అనుభవ రాహిత్యంతో రవీంద్రన్ చేసిన పొరపాట్ల వల్లే సమస్యలు తలెత్తాయని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.