న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఇటీవల కాలంలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు 75 డాలర్ల దిగువకు తగ్గడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తాయని, ద్రవ్యోల్బణం శాంతిస్తుందని, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ చెపుతుందన్న పలు సానుకూల అంచనాలకు గట్టి దెబ్బ తగిలింది. చమురు దేశాల ఉత్పాదక మండలి ఒపెక్ హఠాత్తుగా ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించడంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కసారిగా 5 శాతం పెరిగి 85 డాలర్ల వద్దకు చేరింది. ఈ 2023 సంవత్సరాంతం వరకూ రోజుకు 11.6 లక్షల బ్యారళ్ల ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ నిర్ణయించింది. మే నెల నుంచి ఈ కోత అమలులోకి వస్తుంది. తాము 5 లక్షల బ్యారళ్ల ఉత్పత్తిని తగ్గిస్తున్నట్టు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
95-100 డాలర్ల స్థాయికి…
తాజా పరిణామంతో డిసెంబర్కల్లా బ్రెంట్ క్రూడ్ ధర 95 డాలర్ల వద్దకు, 2024 డిసెంబర్నాటికి 100 డాలర్ల స్థాయికి పెరగవచ్చని గోల్డ్మాన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది డిసెంబర్కల్లా ధర 90-95 డాలర్లను చేరుతుందని ఐఐఎఫ్ఎల్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా సైతం తెలిపారు.