Paytm SBI Rupay Credit Card | పేటీఎం, ఎస్బీఐ కార్డ్ సంయుక్తంగా గురువారం `కో-బ్రాండెండ్` రూపే క్రెడిట్ కార్డు `పేటీఎం ఎస్బీఐ కార్డ్` జారీ చేశాయి. ఈ కార్డు వెల్కం బెనిఫిట్ల కింద కాంప్లిమెంటరీ పేటీఎం ఫస్ట్ మెంబర్షిప్తోపాటు రూ.75 వేల విలువైన ఎక్స్క్లూజివ్ ఆఫర్లు అందిస్తున్నది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకారంతో జారీ చేస్తున్న ఈ క్రెడిట్ కార్డు.. పేటీఎం యాప్ ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్స్ పొందడంతోపాటు విమాన టికెట్లలో డిస్కౌంట్ అందుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ఎక్స్క్లూజివ్ పేటీఎం మెంబర్షిప్తో కస్టమర్లు రూ.750 బెనిఫిట్ పొందొచ్చు.
పేటీఎం ఎస్బీఐ కార్డుతో పేటీఎం యాప్ ద్వారా సినిమా, విమాన, రైలు ప్రయాణ టికెట్లపై మూడు శాతం క్యాష్బ్యాక్, ఇతర కొనుగోళ్లపై రెండు శాతం క్యాష్బ్యాక్, ఇతర లావాదేవీలపై ఒకశాతం క్యాష్బ్యాక్ ఆఫర్ అందిస్తున్నారు. ఎస్బీఐ కార్డు, ఎన్పీసీఐ, రూపే కార్డుతో భాగస్వామ్యం పట్ల హర్షం ప్రకటించారు పేటీఎం ఫౌండర్ కం సీఈవో విజయ్ శేఖర్ శర్మ.
ఈ సందర్భంగా విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ `క్రెడిట్ ప్రధాన పేమెంట్ చాయిస్ అయినప్పుడు తదుపరి చెల్లింపుల విప్లవ పరివర్తనలో భారత్ భాగస్వామి అవుతుంది. ఎస్బీఐ కార్డుతో కలిసి పేటీఎం రూపే క్రెడిట్ కార్డు జారీ చేయడం కస్టమర్లకు గొప్ప చాయిస్. ఇప్పటికే మా యూజర్లు క్యూఆర్ కోడ్ ఆధారిత పేమెంట్స్ చేస్తున్నారు. యూపీఐ క్యూఆర్ కోడ్లపై రూపే క్రెడిట్ కార్డులు పని చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు డిజిటల్ పేమెంట్స్లో నూతన అధ్యాయనం నెలకొల్పుతాయి` అని వ్యాఖ్యానించారు.
ఎస్బీఐ కార్డ్ ఎండీ కం సీఈవో రామ్మోహనరావు అమర మాట్లాడుతూ యువతకు, డిజిటల్ కస్టమర్లకు మరింతగా క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పేటీఎం ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డు జారీ చేస్తున్నట్లు తెలిపారు. రూపే నెట్వర్క్తో ప్రారంభించిన పేటీఎం ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డు తమ పోర్ట్ఫోలియోలో ప్రజాదరణ పొందిన క్రెడిట్ కార్డు అవుతుందన్నారు.