Paytm | ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ షేర్లు సోమవారం 12 శాతం పతనం అయ్యాయి. బ్యాంకులో నిధులు మదుపుతో పరోక్ష పెట్టుబడిదారులుగా ఉన్న చైనా సంస్థలకు డేటా షేర్ చేసిందన్న అభియోగంపై ఈ నెల 11న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చైనా ఆలీబాబా గ్రూప్, జాక్మా ఆంట్ గ్రూప్ సంస్థలకు పేటీఎంలో షేర్లు ఉన్నాయి. కొత్త కస్టమర్లను చేర్చుకోరాదని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను ఆర్బీఐ ఆదేశించింది. కానీ, తాము ఖాతాదారుల డేటాను విదేశీ సంస్థలతో షేర్చేయలేదని, కేంద్రం నిబంధనలకు అనుగుణంగా పని చేస్తున్నట్లు పేటీఎం చెప్పుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విదేశాల్లోని డేటా సర్వర్లలో సమాచారం షేర్ చేసినట్లు ఆర్బీఐ వార్షిక తనిఖీల్లో తేలింది. ఈ నేపథ్యంలో సంస్థ లావాదేవీలపైనా, ఐటీ సిస్టమ్ పనితీరుపై అడిటింగ్ సంస్థతో దర్యాప్తు చేయించాలని పేటీఎంకు స్పష్టం చేసింది. సదరు అడిటింగ్ నివేదిక ఆధారంగా భవిష్యత్లో నూతన కస్టమర్లను చేర్చుకునేందుకు అనుమతించే విషయమై సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకోనున్నది. పేటీఎంపై నిషేధం విధించడం ఇది రెండోసారి. కేవైసీ నిబంధనలను ఉల్లంఘించిందన్న అభియోగంపై 2018 ఆగస్టులోనూ పేటీఎంపై ఆర్బీఐ నిషేధం విధించింది.
గత డిసెంబర్ నెలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా 926 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. సంస్థ వెబ్సైట్ ప్రకారం 30 కోట్లకు పైగా వాలెట్లు, ఆరు కోట్ల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఖాతాదారులకు పేటీఎం.. జీరో బ్యాలెన్స్ అకౌంట్, స్పెండ్ అనలిటిక్స్, డిజిటల్ పాస్బుక్, వర్చువల్ డెబిట్ కార్డు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మనీ ట్రాన్స్ఫర్ సేవలందిస్తున్నది.
2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను ప్రారంభించారు. నొయిడాలో తొలి శాఖ ఏర్పాటు చేయడం ద్వారా సేవింగ్స్ ఖాతా సేవలు ప్రారంభించింది. ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, యూపీఐ, ఫాస్టాగ్, నెట్బ్యాంకింగ్ వసతులు అందుబాటులో ఉన్నాయి. 2018లో డెబిట్ కార్డును ప్రారంభించింది. డీఎండీ, నోడల్ అకౌంట్, నాచ్ సేవలను కూడా ప్రారంభించింది. 2019లో కరంట్ ఖాతా సేవలు అందుబాటులోకి తెచ్చింది. 2020లో వీడియో కేవైసీ ఫెసిలిటీని కూడా తీసుకొచ్చింది. గతేడాది మాస్టర్ కార్డ్ డీసీ, ఎన్సీఎంసీ, ప్రీపెయిడ్ కార్డులు ఆవిష్కరించింది. గత డిసెంబర్లో షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభించడానికి ఆర్బీఐ అనుమతించింది.