SIAM on Auto Sales | కరోనా మహమ్మారి తర్వాత పర్సనల్ మొబిలిటీకి డిమాండ్ పెరిగింది. కానీ గత నెలలో ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ తగ్గిపోయాయి. వివిధ క్యాటగిరీల వాహానాల డెలివరీలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ చరిత్రలో దారుణమైన రికార్డులు నమోదయ్యాయి. 2020 నవంబర్తో పోలిస్తే గత నెలలో 19 శాతం విక్రయాలు పడిపోయాయి. దీనికి సెమీ కండక్టర్ల (చిప్) కొరతే కారణం అని ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ సియామ్ తెలిపింది.
గతేడాది నవంబర్లో 2,64,898 యూనిట్లు డెలివరీ చేస్తే, గత నెలలో 2,15,626 కార్లు మాత్రమే కస్టమర్లకు డెలివరీ అయ్యాయి. ఇదిలా ఉంటే టూ వీలర్ సేల్స్ 34 శాతం పడిపోయాయి. గతేడాది నవంబర్లో 16,00,379 టూ వీలర్స్ అంటే బైక్స్, స్కూటీలు డెలివరీ చేస్తే ఈ ఏడాది 10,50,616 యూనిట్లకే పరిమితం అయ్యాయి టూ వీలర్ కంపెనీలు.
టూ వీలర్స్, కార్లతో పోలిస్తే త్రీ వీలర్ వెహికల్స్ డెలివరీ 7 శాతం తగ్గింది. 2020 నవంబర్లో 24,071 వెహికల్స్ కస్టమర్లకు అందిస్తే ఈ ఏడాది 22,471 యూనిట్లకు పడిపోయాయి. వివిధ క్యాటగిరీల వాహనాలు గతేడాది నవంబర్లో 18,89,348 యూనిట్లు కస్టమర్లకు డెలివరీ చేస్తే ఈ ఏడాది అది 12,88,759 యూనిట్లకే పరిమితమైంది.
అంతర్జాతీయంగా సెమీ కండక్టర్ల కొరతతో దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎదురుదెబ్బలు తింటున్నదని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫెస్టివ్ సీజన్లో కోలుకుంటామని ఆశలు పెట్టుకున్నామని, కానీ నవంబర్ సేల్స్ దారుణంగా దెబ్బ తీశాయన్నారు. ప్యాసింజర్ వెహికల్స్ అంటే కార్ల విక్రయాలు ఏడేండ్ల కనిష్ఠం, టూ వీలర్స్ సేల్స్ 11 ఏండ్ల కనిష్టం, త్రీ వీలర్స్ విక్రయాలు 19 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.