IEX | న్యూఢిల్లీ, మే 2: దేశీయ పవర్ ట్రేడింగ్ ఎక్సేంజ్ల్లో ఒకటైన ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ (ఐఈఎక్స్)లో గత నెల ఓవరాల్ ట్రేడ్ వాల్యూమ్ నిరుడు ఏప్రిల్తో పోల్చితే 14.1 శాతం పెరిగింది. ఈ ఏప్రిల్లో 9,044 మిలియన్ యూనిట్లు (ఎంయూ)గా నమోదైంది. గత ఏడాది 7,928 మిలియన్ యూనిట్లే. ఈసారి డే ఎహెడ్ మార్కెట్ (డీఏఎం) వాల్యూమ్ 4,116 ఎంయూగా, రియల్-టైం ఎలక్ట్రిసిటీ మార్కెట్ (ఆర్టీఎం) వాల్యూమ్ 2,629 ఎంయూగా, టర్మ్-ఎహెడ్ మార్కెట్ (టీఏఎం) వాల్యూమ్ 1,276 ఎంయూగా, ఐఈఎక్స్ గ్రీన్ మార్కెట్ వాల్యూమ్ 402 ఎంయూగా ఉన్నాయి.
ఇక రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్స్ (ఆర్ఈసీ) 618 ఎంయూలుగా ఉన్నాయి. అయితే నిరుడుతో చూస్తే యూనిట్ ధరలు కొంతమేర తగ్గినట్టు కనిపిస్తున్నది. ఐఈఎక్స్ను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రిస్తుంది. దేశీయ పవర్ మార్కెట్లోని రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులు, రకరకాల విద్యుదుత్పత్తిదారులు, పవర్ ట్రేడర్స్, పారిశ్రామిక విద్యుత్తు వినియోగదారుల మధ్య జరిగే విద్యుత్తు క్రయవిక్రయ లావాదేవీలకు ఎలక్ట్రానిక్ వేదికే ఈ ఐఈఎక్స్. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లోనూ ఈ తరహా లావాదేవీలే జరుగుతాయి. భారత్లో ఈ రెండే పవర్ ట్రేడింగ్ ఎక్సేంజ్లుగా ఉన్నాయి.