న్యూఢిల్లీ: కొత్త ఆదాయం పన్ను శాఖ వెబ్సైట్లో ప్రారంభంలో సాంకేతిక సమస్యలు తలెత్తినా ప్రస్తుతం విజయవంతంగా పని చేస్తున్నది. ఇప్పటి వరకు 25 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. 3.57 కోట్ల మంది లాగిన్ అయ్యారు. కొత్తగా 7.90 లక్షలకు పైగా ఈ-పాన్ కార్డులు జారీ చేసినట్లు ఐటీ శాఖ గురువారం వెల్లడించింది.
గత నెల ఏడో తేదీన www.incometax.gov.in, అనే పేరుతో ఐటీ శాఖ నూతన వెబ్సైట్ను ప్రారంభించింది. మొదట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వేతనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తమ వెబ్సైట్ సమస్యలను అధిగమించి సజావుగా సాగుతుందని ఐటీ శాఖ తెలిపింది.
కొత్త ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో 25,82,175 ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్స్) విజయవంతంగా దాఖలయ్యాయని పేర్కొంది. గత రెండు వారాల్లోనే 3,57,47,303 మంది పన్ను చెల్లింపు దారులు లాగిన్ అయ్యారు. మొత్తం 4,57,55,091 మంది లాగిన్ అయ్యారని ఐటీ శాక వెల్లడించింది.
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయడానికి 69,45,539 మంది విజ్ఞప్తులు చేశారు. కొత్తగా 7,94,404 ఈ-పాన్ కార్డులను జారీ చేశామని ఐటీ శాఖ వివరించింది.