Ola Tieup with Banks | పెట్రోల్.. డీజిల్ ధరలు భగ్గుమని మండుతున్న వేళ.. ప్రజలంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల మోజు పెంచుకుంటున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని విద్యుత్ స్కూటర్ను తయారు చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్.. కస్టమర్లకు చేరువయ్యేందుకు పరుగులు తీస్తోంది. ఈ-స్కూటర్ కొనుగోలు చేసేవారికి రుణ పరపతి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఓలా ఎలక్ట్రిక్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గత ఆగస్టు 15న విపణిలోకి ఎస్1, ఎస్ ప్రో 1 మోడల్ ఈ-స్కూటర్లను ఓలా ఎలక్ట్రిక్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) కింద ఈ స్కూటర్ల కొనుగోలుదారులకు రాయితీలు లభిస్తాయి.
ఈ నెల ఎనిమిదో తేదీ (బుధవారం) నుంచి ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. వచ్చేనెల నుంచి కస్టమర్లకు స్కూటర్లను డెలివరీ చేయనున్నది. ఎస్1 స్కూటర్ ధర రూ.99,999 అని సంస్థ సీఈవో భావిష్ అగర్వాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మేం మేజర్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో టైఅప్ చేసుకున్నాం. వాటిలో కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ నెల 8 నుంచి సేవలు ప్రారంభిస్తాయి. మిగతా బ్యాంకులు తర్వాత అందుబాటులోకి వస్తాయి అని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే తెలిపారు.
తాము అత్యంత ఆకర్షణీయ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు వరుణ్ దూబె. ఎస్1 స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్ల సౌకర్యార్థం నెలవారి రుణ వాయిదా రూ.2,999 నుంచి మొదలు కానున్నది.
కస్టమర్లకు రుణ పరపతి కల్పించేందుకు ఓలా ఎలక్ట్రిక్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకులు ఇవే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యెస్ బ్యాంక్.