Ola Electric | గతేడాది సంచలనం సృష్టించిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా.. తాజాగా స్కూటర్ల ఉత్పత్తి నిలిపివేసినట్లు సమాచారం. ఇప్పటికే తమిళనాడులోని కృష్ణగిరి ప్రొడక్షన్ ప్లాంట్లో 4000 స్కూటర్లు నిల్వ ఉన్నాయని తెలుస్తున్నది. ప్రీ-ఆర్డర్ల మేరకు ఉత్పత్తి చేసిన వేల స్కూటర్లకు ఇవి అదనం. ఫ్యూచర్ ఫ్యాక్టరీగా భావిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ యూనిట్లో 600 స్కూటర్లు రోజువారీగా ఉత్పత్తి చేయొచ్చు. కానీ ఇప్పుడు కేవలం 100 స్కూటర్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని సమాచారం. అదీ కూడా గత నెల 21 నుంచి నిలిపి వేశారని తెలియ వచ్చింది. కానీ ఉత్పత్తి నిలిపివేయడానికి యాజమాన్యం చెబుతున్న వాదన, అనధికార వర్గాల నుంచి వస్తున్న వాదన పరస్పరం విరుద్ధంగా ఉండటం గమనార్హం.
వార్షిక మెయింటెనెన్స్, నూతన యంత్రాల ఇన్స్టలేషన్ కోసం ఉత్పత్తిని నిలిపేశామని ఓలా కంపెనీ యాజమాన్యం చెబుతున్నది. కానీ భారీగా నిల్వలు పేరుకోవడం కారణమని ఆ సంస్థలోని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కోసం తమిళనాడులోని హోసూర్ జిల్లా కృష్ణగిరిలో ఉత్పాదక యూనిట్ ప్రారంభించింది. దీనికి `ఫ్యూచర్ ఫ్యాక్టరీ` అని నామకరణం కూడా చేసింది.
గత అక్టోబర్లో ఉత్పత్తి ట్రయల్స్ ప్రారంభించినా.. డిసెంబర్ నుంచే రెగ్యులర్గా స్కూటర్ల ఉత్పత్తి మొదలైంది. అంటే, ఓలా ఎలక్ట్రిక్లో స్కూటర్ల ఉత్పత్తి మొదలై కేవలం ఎనిమిది నెలలే అయ్యింది. కానీ, ఇతర సంస్థల మాదిరిగానే తమ సంస్థ కూడా ఫ్యాక్టరీ వార్షిక మెయింటెనెన్స్ పనులు చేపట్టిందని ఓలా అధికార ప్రతినిధి చెప్పారు. కానీ, ఉత్పత్తి నిలిపేశామని గానీ, తగ్గించామని వచ్చిన వార్తలు నిజం కాదన్నారు.
అయితే, ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల రోజువారీ ఉత్పత్తి ఎంత.. ఎంత మంది బుక్ చేసుకున్నారన్న సంగతి మాత్రం వెల్లడించలేదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రారంభంలో 1.50 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. కానీ వాటి పనితీరులో ఫెయిల్యూర్, సాంకేతిక లోపాలు ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో భారీ సంఖ్యలో స్కూటర్ల బుకింగ్స్ రద్దు చేసుకున్నారు. రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్రి ప్రమాదాలు జరుగడంతో కొనుగోలుదారులు వెనక్కు తగ్గారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు, ఫెయిల్యూర్స్, సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది.