Ola Electric-Bhavish Aggarwal | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ `ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కొత్తగా 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నది. ప్రస్తుతం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో న్యూ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తున్నారు. ఈ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 25 వేల మందికి కొలువులు లభిస్తాయని కంపెనీ కో-ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. సోమవారం జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన ఈ సంగతి చెప్పారు. 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ `ఈవీ హబ్` విస్తరించి ఉన్నది. స్కూటర్ల ఉత్పత్తితోపాటు సప్లయర్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రెండూ కలిస్తే ఈ యూనిట్.. గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కు భారత్ను గ్లోబల్ కేంద్రంగా మారుస్తుందని భవిష్ అగర్వాల్ తెలిపారు.
ఎనిమిది నెలల్లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ యూనిట్ విజయవంతంగా నిర్మించుకున్నట్లు భవిష్ అగర్వాల్ తెలిపారు. వచ్చేనెల నుంచి ఈవీ స్కూటర్ల ఉత్పత్తి తయారవుతుందని అన్నారు. రికార్డు సమయంలో ఈవీ స్కూటర్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలోనే ఇది సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.
తమిళనాడులోకి కృష్ణగిరి ఈవీ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ.. దేశంలోనే తొలి గిగా ఫ్యాక్టరీగా నిలుస్తుందని భవిష్ అగర్వాల్ తెలిపారు. ప్రతి ఏటా సుమారు ఒక కోటి టూ వీలర్స్ తయారవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్పాదక యూనిట్ కోసం గతేడాది తమిళనాడు ప్రభుత్వంతో ఓలా ఎలక్ట్రిక్.. అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం ఓలా ఎలక్ట్రిక్ రూ.7000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నది.
గత జూన్లోనే తమిళనాడులో మెగా మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సహకారంతో తమిళనాడు గిగా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు తెలిపింది. దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ లీడర్గా నిలిచింది. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం ఈవీ స్కూటర్ల విక్రయంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 32 శాతం. గతేడాది నవంబర్ నాటికి దాదాపు 30 వేల ఈవీ స్కూటర్లను విక్రయించింది.