చిన్న వయస్సు నుంచే రిటైర్మెంట్ ఫండ్పై దృష్టి పెట్టాలనుకునేవారికి అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) అందుబాటులో ఉన్నది. ముఖ్యంగా టీనేజర్లు ఈ పథకంలో చేరితే మిగతా వయస్కులకన్నా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. వయస్సు పెరిగేకొద్దీ ప్రీమియం పెరిగే ఈ పథకానికి 18-40 ఏండ్లవారు అర్హులు. 18 ఏండ్లవారు ఈ పథకంలో చేరితే 42 ఏండ్లపాటు ప్రీమియంలు చెల్లిస్తూ పోవాలి. అలాగే 40 ఏండ్లవారు.. మరో 20 ఏండ్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఖాతాదారుల వయస్సు ఏదైనా.. వారికి 60 ఏండ్లు వచ్చేదాకా ప్రీమియం చెల్లింపులు కొనసాగుతాయి.
ఏపీవై ఖాతాను తెరవడం ఎలా?
అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరాలనుకునేవారికి తప్పకుండా బ్యాంక్ లేదా పోస్టాఫీస్లో సేవింగ్స్ ఖాతా ఉండాలి. ఖాతా ఉన్నచోట సిబ్బంది సహాయంతో ఏపీవై రిజిస్ట్రేషన్ ఫారాన్ని నింపాలి. ఆధార్ (తప్పనిసరేం కాదు), మొబైల్ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఎంచుకున్న చెల్లింపుల పద్ధతిని అనుసరించి ఏపీవైకి మీ ప్రీమియం సొమ్ము ఖాతా నుంచి తీసుకోవడం జరుగుతుంది. నెల, 3 నెలలు, 6 నెలల చొప్పున ప్రీమియం చెల్లింపునకు అవకాశం ఉన్నది.
ప్రీమియంలు, పెన్షన్లు ఇలా..
18 ఏండ్లవారు 60 ఏండ్ల తర్వాత తమకు నెలనెలా వెయ్యి రూపాయల పెన్షన్ రావాలనుకుంటే.. నెలకు రూ.42 చెల్లించాలి. 3 లేదా 6 నెలలకోసారి చెల్లించేవారికైతే ఈ ప్రీమియం రూ.125, రూ.248గా ఉన్నది. ఇక నెలకు రూ.2 వేలు, రూ.3 వేలు, రూ.4 వేలు, రూ.5 వేల చొప్పున పెన్షన్ పొందాలనుకుంటే.. ఆయా ప్రీమియంలూ అంతే ప్రాతిపదికన పెరుగుతాయి. మొత్తంగా ఈ పథకంలో నెలకు కనిష్ఠంగా వెయ్యి రూపాయలు, గరిష్ఠంగా రూ.5 వేలు పెన్షన్గా తీసుకోవచ్చు.