CBDT on IT Returns | 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ సంఖ్య పెరిగిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సంగీతా సింగ్ చెప్పారు. 2020-21లో 6.9 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలైతే గత ఆర్థిక సంవత్సరంలో 7.14 కోట్లకు పెరగడమే స్పష్టమైన వృద్ధి అని పీటీఐతో మాట్లాడుతూ అన్నారు. ప్రాథమిక టాక్స్ పేయర్లు, రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేసేవారి సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటేనే పన్ను వసూళ్లు పెరుగుతాయని వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలతోపాటు వస్తు, సేవల క్రయ విక్రయాలు కూడా పెరుగుతాయని వెల్లడించారు.
డిజిటల్ ఇండియా నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు, ఇన్షియేటివ్ మేరకే పన్ను చెల్లింపుల్లో వృద్ధిరేటును చూడొచ్చునని సంగీతా సింగ్ తెలిపారు. కరోనా వేళ ప్రజల్లో డిజిటల్ చెల్లింపులు పెరగడంతో వారి మనోభావాల్లో మార్పు వచ్చి ఉండొచ్చునన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22లో పన్ను వసూళ్లు రూ.14 లక్షల కోట్లు దాటాయని వెల్లడించారు.