Nirmala on NSE | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో కో-లోకేషన్ కేసులో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కేసుపై ఐటీ శాఖ, సెబీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా భావిస్తున్న ఎన్ఎస్ఈలో 2009-10లో కో-లొకేషన్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల ఒకటో తేదీన బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ వివరాలు తెలియకుండా స్పందించడం అనుచితం అని వ్యాఖ్యానించారు. ఎన్ఎస్ఈలో అవకతవకలపై ప్రభుత్వం పరిశీలిస్తున్నదని మంగళవారం మీడియాతో అన్నారు.
ఎన్ఎస్ఈ నిర్వహణలో పరిపాలనా పరమైన (గవర్నెన్స్) అవకతవకలు చోటు చేసుకున్నాయని ఇటీవల సెబీ నివేదిక విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో ఒక స్టాక్ బ్రోకర్ అవకతవకలపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. సోమవారం ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్ ఆనంద్ సుబ్రమణ్యన్ను ప్రశ్నించింది. గతవారం ఎన్ఎస్ఈ మాజీ ఎండీ కం సీఈవో చిత్ర రామకృష్ణతోపాటు మరో మాజీ సీఈవో రవి నరైన్లనూ ప్రశ్నించింది.
అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ముడి చమురు ధరలు దేశీయ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ముప్పుగా పరిణమించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఎల్ఐసీ ఐపీవోపై కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల ప్రభావం దేశీయ ఎగుమతిదారులపై పడకుండా చూస్తామని తెలిపారు.