నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) టైర్-2 ఖాతాలకు ఇక నుంచి క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయలేరు. అన్ని ఎన్పీఎస్ టైర్-2 ఖాతాలకు క్రెడిట్ కార్డు చెల్లింపులు స్వీకరించడాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) అన్ని పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీలు)కు నోటిఫై చేసింది. మ్యూచువల్ ఫండ్లు, షేర్లు వంటి మదుపు సాధనాల్లో క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై నియంత్రణలు విధిస్తున్నా, ఎన్పీఎస్ పొదుపు సాధనంలో మాత్రమే ఈఎన్పీఎస్ పోర్టల్ ద్వారా క్రెడిట్ కార్డులతో పెట్టుబడుల్ని ఇప్పటివరకూ అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఎన్పీఎస్ ఖాతాదారులు క్రెడిట్ కార్డులతో చెల్లింపుచేస్తే 0.60 శాతం పేమెంట్ గేట్వే చార్జీగా వసూలు చేస్తున్నారు. దీనికి జీఎస్టీ అదనం.
చందాదారుల ప్రయోజనాల్ని పరిరక్షించేదిశగా, నేషనల్ పెన్షన్ సిస్టమ్ వృద్ధి సజావుగా జరిగేందుకు తాజాగా క్రెడిట్ కార్డు చెల్లింపుల్ని నిలిపివేసినట్టు పీఎఫ్ఆర్డీఏ తెలిపింది. 2004 జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రారంభించిన ఎన్పీఎస్లో చందాదారులుగా చేరేందుకు 2009 నుంచి సాధారణ ప్రజలను సైతం అనుమతించారు. ఇందులో టైర్1, టైర్2 అనే రెండు రకాల ఖాతాలుంటాయి. టైర్1 ఖాతాకలిగిన వారు మాత్రమే స్వచ్ఛందంగా టైర్2 ఖాతాను తెరవవచ్చు. రూ.500 కనీస చెల్లింపుతో టైర్1 ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ ఖాతాదారుకు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80సీసీడీ కింద ప్రయోజనాలు లభిస్తాయి. రూ.1000 కనీస చెల్లింపుతో ప్రారంభించే టైర్2 ఖాతా ద్వారా ఐటీ మినహాయింపు లభించవు.