Ratan Tata | ఏ రూపంలోనూ క్రిప్టో కరెన్సీలతో తనకు అనుబంధం లేదని టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా స్పష్టం చేశారు. ‘నెటిజన్లూ.. అవగాహన చేసుకోవాలని అభ్యర్థిస్తున్నా.. నాకు ఏ రూపంలోనూ క్రిప్టో కరెన్సీ లావాదేవీలతో సంబంధం లేదు’ అని ట్వీట్ చేశారు. `మీరు క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ఏ వార్తా కథనంలో గానీ, వాణిజ్య ప్రకటనలో నాకు అనుబంధం ఉన్నట్లు చూసినా అది అసత్యం. స్కామర్లు చేసే ప్రయత్నమే’ అని పేర్కొంటూ దీనికి సంబంధించిన స్క్రీన్షాట్ షేర్ చేశారు.
రతన్ టాటా ట్వీట్పై ఓ యూజర్ స్పందిస్తూ.. ‘తప్పకుండా సార్. మీ గురించి మాకు తెలుసు. ఈ తరహా యాడ్స్, అప్లికేషన్స్ మేం ఎప్పుడు విశ్వసించం` అని పేర్కొన్నాడు. `క్రిప్టో కరెన్సీలపై మీ వైఖరి తెలియజేసినందుకు ధన్యవాదాలు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులతో ఇబ్బందులు కొని తెచ్చుకోవాలని భావించే వారికి ఇది చాలా ముఖ్యం. స్కామ్ ల గురించి హెచ్చరించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం మిస్టర్ టాటా’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
ఇంతకుముందు మరో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టారని ఫేక్ వార్తలు వచ్చాయి. ఆ ఫేక్ వార్తలను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా ఖండించారు. క్రిప్టో కరెన్సీల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని ట్వీట్ చేశారు.