Nissan Magnite | ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) తన మ్యాగ్నైట్ (Magnite) కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. 2020 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకూ తయారైన మాగ్నైట్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఫ్రంట్ డోర్ హ్యాండిల్ సెన్సర్లలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే రీకాల్ చేస్తున్నామని వివరించింది. వాటిని రిట్రోఫిట్ చేస్తామని వెల్లడించింది. ఎన్ని కార్లను రీకాల్ చేస్తున్నదో నిసాన్ మోటార్ తెలుపలేదు. బేస్ ఎక్స్ఈ, మిడ్ ఎక్స్ఎల్ వేరియంట్ కార్లలో మాత్రమే ఈ సమస్య తలెత్తినట్లు వివరించింది.
అయితే ఫ్రంట్ డోర్ హ్యాండిల్ సెన్సర్ల వల్ల ప్రయాణికుల భద్రతకు ఎటువంటి ఢోకా లేదని నిసాన్ మోటార్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. 2023 డిసెంబర్ తర్వాత తయారైన అన్ని నిసాన్ మ్యాగ్నైట్ మోడల్ కార్లలో ఎటువంటి సాంకేతిక లోపం లేదని పేర్కొన్నది. సాంకేతిక లోపం తలెత్తిన కార్ల ఓనర్ల గుర్తింపు ప్రక్రియ చేపడతామన్నది. కస్టమర్లు తమకు సమీప నిసాన్ సర్వీస్ వర్క్ షాపును సందర్శించి ఉచితంగా సెన్సర్ రిట్రోఫిట్ చేసుకోవచ్చునని పేర్కొంది. నిసాన్ మోటార్ ఇండియాకు గల ఎస్యూవీ కారు మ్యాగైట్. ఇది ఫైవ్ సీటర్ మోడల్ లో అందుబాటులో ఉంది.