కరోనా మహమ్మారితో గత రెండేండ్లలో పర్సనల్ ఫైనాన్స్ రంగం స్వరూపమే మారిపోయింది. క్రెడిట్ కార్డుల మీద కొనుగోళ్లు పెరిగాయి. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ లోన్లకు డిమాండ్ వచ్చిపడింది. దీనికితోడు మార్కెట్లో మదుపరులు సైతం అంతే గణనీయంగా పెరిగారు. కొత్త డీమ్యాట్ అకౌంట్ల సంఖ్యేఇందుకు సాక్ష్యం. ఇక కొనుగోలు శక్తిలో మార్పులు అనేకం. మొత్తంగా ఆర్థిక సేవల రంగంలో ఫిన్టెక్ సంస్థల ఆవిర్భావం.. పర్సనల్ ఫైనాన్స్లో నూతన పోకడలకు నాంది పలికింది.
డిజిటల్ బ్యాంకులు లేదా నియో బ్యాంకులు.. దేశీయ పర్సనల్ ఫైనాన్స్ రంగాన్ని గతకొంత కాలంగా ఆకర్షణీయంగా మార్చాయి. సంప్రదాయ బ్యాంకులకు భిన్నంగా బ్యాంకింగ్ సేవలను అందించడం వీటి ప్రత్యేకత. కేవలం ఒక్క యాప్తోనే అన్ని మనీ మేనేజ్మెంట్ అవసరాలు తీరిపోతున్నాయి. నగదు బదిలీ సులభమైపోయింది. బడ్జెటింగ్ టూల్స్, అప్పటికప్పుడు మదుపు చేయగలగడం, ఈఎంఐలు-పాలసీల వంటి వరుస చెల్లింపులను గుర్తు చేయడం.. ఇలా ఎన్నింటినో నియో బ్యాంకులు చిటికెలో చేసేస్తున్నాయి. వీటికయ్యే వ్యయాలు కూడా చాలా స్వల్పం. ఫిన్టెక్ కంపెనీలు సంప్రదాయ బ్యాంకులతో ఒప్పందాలను కుదుర్చుకుని పై సేవలన్నింటినీ వినియోగదారులకు అందిస్తున్నాయి. కోటక్ 811, ఎఫ్ఐ మనీ, ఇన్స్టాంట్ పే, రేజర్పే ఎక్స్, డిజీ బ్యాంక్, జూపిటర్ వంటివి అమితమైన ప్రజాదరణను పొందాయి.
ఈటీఎఫ్లు
కరోనా మహమ్మారి తర్వాత కొత్త ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను పెడుతుండటంతో, గతంలో ఎన్నడూ లేనంత రిటైల్ ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి. అయితే వీరిలో చాలామంది నేరుగా షేర్లలో పెట్టుబడులు పెట్టకుండా.. పరోక్ష పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్)కు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో వీటిలో పెట్టుబడులు రూ.2.3 లక్షల కోట్ల నుంచి రూ.3.64 లక్షల కోట్లకు ఎగబాకాయి. గతేడాది ఈటీఎఫ్లలో పెట్టుబడులు 29 శాతం వృద్ధి చెందితే, ఈ ఏడాది ఏకంగా 58 శాతం ఎగిశాయి. ఈటీఎఫ్లను కొనుగోలు చేయడం సులభం. లావాదేవీ వ్యయాలు తక్కువగా ఉండటం, ఇండెక్స్-గోల్డ్ ఈటీఎఫ్లతోపాటు సిల్వర్ ఈటీఎఫ్లూ అందుబాటులోకి రావడం, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కొనుగోలు చేసే వీలుండటం లాభదాయకంగా ఉన్నది. విదేశీ మార్కెట్లలో మదుపు చేయగలగడం మరో సదుపాయం.
బై నౌ.. పే లేటర్
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (బై నౌ.. పే లేటర్) అనేది ప్రస్తుతం పర్సనల్ ఫైనాన్స్ రంగంలో ఓ ట్రెండ్. నిజానికి దీనికి, వాయిదాలపై కొనుగోలు పద్ధతికి పెద్ద తేడా లేదు. కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వడ్డీ లేకుండా వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ-కామర్స్ సంస్థల్లో, రిటైల్ స్టోర్లలో ఈ ఆఫర్లు ఎక్కువ. వడ్డీలేని కొనుగోళ్లన్నీ 3 లేదా 6 నెలల కాలపరిమితితో ఉంటాయి. కేవైసీ సమర్పిస్తే చాలు ఎలాంటి తనిఖీలు లేకుండానే అప్పటికప్పుడు కొనుగోలు చేసే వీలుంటుంది. కొన్ని బ్యాంకులు ఫిన్టెక్ కంపెనీలతోనూ రిటైల్ లేదా ఆన్లైన్ స్టోర్స్తో కలిసి బ్రాండెడ్ డెబిట్ కార్డులను అందిస్తున్నాయి. ఇది కొత్త సీసాలో పాత పచ్చడే అయినా.. నో కాస్ట్ ఈఎంఐ అనేదే ఆకర్షణీయం. వచ్చే ఏడాదీ ఈ ట్రెండ్ పుంజుకోనుందన్న అంచనాలున్నాయి.