Jet Airways | రెండేండ్ల క్రితం 2019లో నేలకు పరిమితమైన ప్రైవేట్ ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్ ఇప్పట్లో టేకాఫ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. జెట్ ఎయిర్వేస్ టేకోవర్ చేసేందుకు ముందుకు వచ్చిన కన్సార్టియం సమర్పించిన రిజొల్యూషన్ ప్లాన్పై ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సదరు కన్సార్టియం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఎన్సీఎల్ఏటీ ముంబై బెంచ్ను ఆశ్రయించింది. దీనిపై ముగ్గురు సభ్యుల ఎన్సీఎల్ఏటీ బెంచ్ స్పందించింది.
జెట్ ఎయిర్వేస్ రిజొల్యూషన్ ప్రొఫెషనల్, క్రెడిటార్ల కమిటీలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. క్రెడిటార్ల కమిటీలో పీఎన్బీ ఉంటే వారంలోపే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ కేసును విచారణకు అనుమతించాలా.. వద్దా అన్న అంశంపై ఈ నెల 21న నిర్ణయం తీసుకోనున్నది.
గత జూన్ 22న కల్రాక్-జలాన్ కన్సార్టియం సమర్పించిన రిజొల్యూషన్ ప్లాన్కు ఆమోదం తెలపడాన్ని పీఎన్బీ సవాల్ చేసింది. లండన్ కేంద్రంగా పని చేస్తున్న కల్రాక్ క్యాపిటల్, యూఏఈ కేంద్రంగా పని చేస్తున్న వ్యాపార వేత్త మురారీ లాల్ జలాన్ కన్సార్టియంగా ఏర్పడ్డారు. వర్కింగ్ క్యాపిటల్గా జెట్ఎయిర్వేస్ క్రెడిటర్లకు రూ.1000 కోట్లు ఇచ్చేందుకు కన్సార్టియం ప్రారంభంలో సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం దాన్ని రూ.202 కోట్లకు కుదించివేసింది. ఇది దివాళా ప్రక్రియ నిబంధనలకు పూర్తి వ్యతిరేకం అని పీఎన్బీ తెలిపింది.
ఇప్పటికే కల్రాక్-జలాన్ కన్సార్టియం రిజొల్యూషన్ ప్రణాళికకు వ్యతిరేకంగా జెట్ ఎయిర్వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్, భారతీయ కాంగార్ సేన.. ఎన్సీఎల్ఏటీలో వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. పెండింగ్లో ఉన్న తమ వేతన బకాయిలు, సీఐఆర్పీ వ్యయం రిజొల్యూషన్ ప్లాన్లో చేర్చలేదని వాదించాయి.
రెండు దశాబ్దాలకు పైగా విమానయాన రంగంలో సేవలందించిన జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొనడంతో 2019 ఏప్రిల్ 17న ఆపరేషన్స్ సస్పెండ్ చేసింది. నాటి నుంచి జెట్ ఎయిర్వేస్ విమానాలు నేలకే పరిమితం అయ్యాయి. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియంకు జెట్ ఎయిర్వేస్ రూ.8000 కోట్లకు పైగా బకాయి పడింది.
గతేడాది అక్టోబర్లో కల్రాక్-జలాన్ కన్సార్టియం సమర్పించిన రిజొల్యూషన్ ప్లాన్ను ఎయిర్లైన్స్ క్రెడిటార్స్ కమిటీ ఆమోదించింది. వచ్చే ఏడాది సేవలను ప్రారంభించేందుకు కల్రాక్-జలాన్ కన్సార్టియం ప్రయత్నాలు చేస్తున్నది.
జెట్ ఎయిర్వేస్ 1993 మే ఐదో తేదీ నుంచి ఎయిర్ టాక్సీ ఆపరేటర్గా సేవలు ప్రారంభించింది. అందుకు బోయింగ్ 737-300 విమానాలను అద్దెకు తీసుకున్నది. 1995లో సంస్థ సేలు మొదలయ్యాయి. 2004 లో విమాన సర్వీసులను ప్రారంభించింది. చెన్నై-కొలంబో మధ్య 2004 మార్చిలో తొలి ఇంటర్నేషనల్ సర్వీస్ నడిపింది.