5G | న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. సర్వీసులు మొదలైన 10 నెలల్లోపే టెలికం సంస్థలు 3 లక్షలకుపైగా 5జీ మొబైల్ సైట్లను ఏర్పాటు చేశాయని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 714 జిల్లాల్లో ఈ సైట్లను టెలికం కంపెనీలు తెచ్చాయని మంగళవారం సోషల్ మీడియా వేదిక ‘కూ’ ద్వారా తెలియజేశారు. తొలి 5 నెలల్లో లక్ష సైట్లు, తర్వాతి 5 నెలల్లో మరో 2 లక్షల సైట్లు అందుబాటులోకి వచ్చాయి. 5జీ టెలికం సర్వీసులు.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నెట్వర్క్గా ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దేశీయంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మ్రాతమే ఇప్పుడు 5జీ సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. నిరుడు అక్టోబర్ 1న దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన సంగతి విదితమే.
వెనుకబడ్డ బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ రంగ టెలికం సేవల సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 5జీ రేసులో వెనుకబడిపోయింది. నిజానికి దేశంలోని ప్రైవేట్ రంగ సంస్థలు విస్తారంగా ఇస్తున్న 4జీ సేవలనూ అందుకునేందుకు బీఎస్ఎన్ఎల్కు చాలాకాలమే పట్టింది. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ మాత్రమే భారత్లో టెలికం సర్వీసులను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా.. తమకున్న ఆర్థిక పరిస్థితులు, కస్టమర్ బేస్ దృష్ట్యా వెనుకబడినప్పటికీ.. ప్రభుత్వ సంస్థగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కూడా అదే దారిలో పయనిస్తుండటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీఎస్ఎన్ఎల్నూ ప్రగతిపథంలో నడిపించేదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో..
స్పెక్ట్రమ్ వేలంలో బీఎస్ఎన్ఎల్కు ఎప్పుడూ నిరాశే ఎదురవుతున్నది. ఒకప్పుడు ఎక్కడైనాసరే బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తర్వాతే మిగతా కంపెనీల నెట్వర్క్కు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రైవేట్ రంగ కంపెనీలకే మోదీ సర్కారు అగ్ర తాంబూలం ఇస్తున్నదని అంటున్నారు. బీఎస్ఎన్ఎల్కూ 4జీ, 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపితే సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోగలిగి ఉండేదని చెప్తున్నారు.