RBL | ముంబై, ఆగస్టు 4: బ్యాంకింగ్ పరిశ్రమను సవివరంగా అవగాహన చేసుకోవడానికే ఆర్బీఎల్ బ్యాంక్లో (రత్నాకర్ బ్యాంక్) తాము 7-10 ఏండ్ల దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి చేశామని ఎం అండ్ ఎం సీఈవో అనీశ్ షా చెప్పారు. ఫలితాల వెల్లడి తర్వాత షా మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ‘తప్పనిసరి వ్యూహాత్మక కారణాలు’ కన్పిస్తే తప్ప ఆర్బీఎల్ బ్యాంక్లో ప్రస్తుత పెట్టుబడి పరిశ్రమ గురించి తెలుసుకోవడానికేనని తెలిపారు.
రూ.417 కోట్లకు ఆర్బీఎల్ బ్యాంక్లో 3.53 శాతం కొనుగోలు చేశామని, ఈ వాటాను 9.9 శాతానికి పెంచుకుంటామంటూ జూలై 26 మహీంద్రా వెల్లడించింది. ఈ అంశం ఇన్వెస్టర్లను కలవరపర్చింది. ప్రస్తుతానికి బ్యాంకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించే యోచన లేదని, షేర్లు (ఆర్బీఎల్ బ్యాంక్) లభించే ధర, రెగ్యులేటర్ల అనుమతులు, ఇతర నిబంధనలకు లోబడి తదుపరి పెట్టుబడులు చేస్తామని, అయితే 9.9 శాతానికి మించి కొనబోమని సీఈవో వివరించారు.