ప్రతి నెలా వివిధ రకాల బిల్లు చెల్లింపుల తేదీలను గుర్తుంచుకోవడం కష్టమే. ఇక ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే వాటి పేమెంట్ డ్యూ డేట్లను ఇట్టే మర్చిపోతుంటాం. మీరూ మీ క్రెడిట్ కార్డ్ చెల్లింపు తేదీని మర్చిపోయారా? అయినప్పటికీ భయపడనక్కర్లేదు. చెల్లింపు గడువు తేదీ దాటి మూడు రోజులయ్యాకే కార్డుదారులపై ఆలస్య రుసుము చార్జీలు వేయాలని బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ జారీదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది మరి.
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్-జారీ, నిర్వహణ మార్గదర్శకాలు 2022 ప్రకారం క్రెడిట్ కార్డ్ చెల్లింపుల గడువు తేదీ దాటిన మూడు రోజుల్లోగా బకాయిని తీర్చేస్తే ఎటువంటి జరిమానాలుండవు. అంతేగాక మీ క్రెడిట్ స్కోర్కు వచ్చే ఇబ్బందేమీ కూడా ఉండదు. కానీ ఈ మూడు రోజులు దాటిన తర్వాత కూడా చెల్లింపులు చేయకపోతే ఫైన్ తప్పదు. లేట్ ఫీ చార్జీ ఎంతన్నది బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ జారీదారులే నిర్ణయిస్తారు. సాధారణంగా ఈ ఆలస్య రుసుముల మొత్తాన్ని తర్వాతి బిల్లింగ్లో కలుపుతారు.
చార్జీలు ఎంతెంత..
బకాయి మొత్తాలనుబట్టే ఆలస్య రుసుములుంటాయి. మీరు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటే.. లేట్ ఫీజు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు ఎస్బీఐ కార్డ్.. చెల్లించాల్సిన బకాయి రూ.500-1,000 మధ్య ఉంటే రూ.400 ఆలస్య రుసుముగా క్రెడిట్ కార్డుదారుల నుంచి వసూలు చేస్తున్నది. ఒకవేళ రూ.1,000-10,000 మధ్య బకాయి ఉన్నట్టయితే రూ.750 లేట్
ఫీజు వేస్తున్నది. ఇక రూ.10,000లకుపైగా బకాయిపై రూ.950, రూ.25,000లకుపైగా బకాయిపై రూ.1,100 ఆలస్య రుసుములున్నాయి. కాగా, చెల్లింపుల గడువు తేదీ దాటి ఎన్ని రోజులు గడిచాయి?, ఇందుకు ఆలస్య రుసుము చార్జీలు ఎంత? అన్నది క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో స్పష్టం చేయాలని బ్యాంకర్లకు, క్రెడిట్ కార్డు జారీదారులకు ఆర్బీఐ సూచించింది. ఈ క్రమంలోనే జరిమానా వడ్డీ, ఆలస్య రుసుము చార్జీలు, ఇతర సంబంధిత చార్జీలు గడువు తేదీ తర్వాత మిగిలిన బకాయిపైనే వేయాలని, మొత్తం అమౌంట్పై కాదని కూడా తెలిపింది.
చివరగా..
నిర్ణీత గడువులోగానే క్రెడిట్ కార్డుదారులు చెల్లింపులను చేయడం మంచిది. అత్యవసరాలు, ఆర్థిక ఇబ్బందులుంటే తప్ప పేమెంట్స్ను మిస్ చేయవద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అదనపు చార్జీలకు దారితీస్తుంది. అలాగే మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి రెగ్యులర్ పేమెంట్సే ఉత్తమం.