హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల కోసం త్వరలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు తోడ్పాటునందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
కీసరలోని బాల వికాస క్యాంపస్లో ఏర్పాటు చేసిన బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (సీఎస్ఆర్బీ) వార్షిక ఈవెంట్ను, సోషల్ స్టార్టప్ ఎక్స్పోను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. అట్టడుగు స్థాయిలో సామాజిక మార్పును తీసుకొచ్చేందుకు బాల వికాస లాంటి సంస్థల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.
రాష్ట్రంలో స్మైల్ డిజిటల్ పెట్టుబడులు
కెనడాకు చెందిన స్మైల్ డిజిటల్ హెల్త్ కంపెనీ సీఈవో డంకన్ వెదర్స్టన్.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్బాబును శనివారం సచివాలయంలో కలిశారు. అదేవిధంగా ఎస్ఆర్ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ప్రతినిధి రాయ్ హుస్సేన్ మంత్రిని కలిశారు. హెల్త్కేర్ రంగంలో డాటాకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించేందుకుగాను రాష్ట్రంలో కంపెనీని ఏర్పాటు చేస్తామని, తద్వారా 500 నుంచి 1,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని మంత్రికి వివరించారు.