హైదరాబాద్, డిసెంబర్ 5: మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ).. సిల్వర్జూబ్లీ వేడుకలకు వేదికైంది. ఇది మొదలై 25 ఏండ్లవుతున్న సందర్భంగా హైదరాబాద్తోపాటు బెంగళూరు, నోయిడాల్లోని క్యాంపస్లలో పెద్ద ఎత్తున సంబురాలు జరిగాయి. లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పాల్గొనగా.. ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు. కాగా, కోపైలట్స్సహా ఇతర కృత్రిమ మేధస్సు (ఏఐ) అప్లికేషన్స్ (యాప్లు) వంటి ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను రూపొందించడంలో రిసెర్చ్, ఇంజినీరింగ్, డెవలప్మెంట్లదే కీలకపాత్ర.
వీటి ఆధారంగా నడిచేదే ఐడీసీ. ఐడీసీ వేదికగా గడిచిన 25 ఏండ్లలో మైక్రోసాఫ్ట్ 365 (ఆఫీస్) మొబైల్, స్పెషలైజ్డ్ ఏఐ కంప్యూటర్ అజుర్, విండోస్ ఆధునికీకరణ తదితర ప్రజాదరణ పొందిన సేవల్ని సృష్టించి, మెరుగుపర్చారు. ‘గత 25 ఏండ్లలో ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎన్నో ఘనతల్ని సాధించింది. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు, సేవలకు దన్నుగా నిలిచింది’ అని మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్ అన్నారు. మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్పై 20 భారతీయ భాషల్లో సేవల్ని అందుబాటులోకి తెచ్చామని, దీంతో కస్టమర్లందరికీ చేరువయ్యామని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవల సమాచారం కోట్లాది మంది భారతీయులకు వారివారి మాతృ భాష, ప్రాంతీయ భాషల్లో లభ్యమైందని గుర్తుచేశారు.