న్యూఢిల్లీ, జనవరి 18: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..17 వేలకు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్బ్యాగ్నకు సంబంధించి సమస్యలు తలెత్తడంతో 17,362 యూనిట్ల ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెనో, గ్రాండ్ విటారా మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 8, 2022 నుంచి జనవరి 12, 2023 వరకు ఉత్పత్తైన ఆరు మాడళ్లను పరిశీలించడంతో ఎయిర్బ్యాగ్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని గుర్తించినట్లు, వీటిని ఉచింతగా రీప్లేస్ చేసి ఇవ్వనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వాహన ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్బ్యాగ్లు యాక్టివేట్ కావడం లేదని, ఇలాంటి వాటి స్థానంలో కొత్తదాంతో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ భాగాలను రీప్లేస్ చేసేంత వరకు ఈ మాడళ్లను కొనుగోలు చేసిన వారు వీటిని వినియోగించకూడదని సంస్థ హెచ్చరించింది.